Revanth Vs Nirmala: లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి టాక్ ఆఫ్ ది హౌజ్ అయ్యారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్వలా సీతారామన్ కు రేవంత్ కు మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి భాషపై నిర్మలా కామెంట్ చేయడం.. అందుకు ప్రతీగా రేవంత్ సైతం హాట్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. స్పీకర్ సైతం జోక్యం చేసుకొని రేవంత్ రెడ్డిని వారించగా.. నిర్మలా సీతారామన్ తీరుపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
రూపాయి పతనంపై లోక్సభలో చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ‘మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి ఐసీయూలో ఉందంటూ పోల్చారు’ అంటూ రేవంత్ రెడ్డి తన ప్రశ్నలు ప్రారంభించారు. దీనిపై స్పీకర్ జోక్యం చేసుకుని.. నేరుగా ప్రశ్న అడగాలని సూచించారు. ‘సర్, మధ్యలో అంతరాయం కలిగించొద్దు’ అంటూ రేవంత్ అనడంతో.. అలా అనడం సమంజసం కాదని స్పీకర్ తప్పుబట్టారు.
ఇక, రూపాయి పతనంపై రేవంత్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ కౌంటర్ వేశారు. కాంగ్రెస్ ఎంపీ ‘వీక్ హిందీ’లో అడిగిన ప్రశ్నకు ‘వీక్ హిందీలో’నే సమాధానం ఇస్తానన్నారు. తన హిందీని ఉద్దేశించి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ అభ్యంతరం చెప్పారు. తాను శూద్రిడినని.. తనకు స్వచ్ఛమైన హిందీ రాదని చెప్పారు. నిర్మలా సీతారామన్ బ్రాహ్మణవాది ఆమెకు స్వచ్ఛమైన హిందీ వచ్చని రేవంత్ రెడ్డి అన్నారు.
రేవంత్ వ్యాఖ్యలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వారించారు. సభలో ఎవరూ కులం, మతం ప్రస్తావన తీసుకురాకూడదని సూచించారు. ఎవరైనా అలాంటి పదాలు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ భగ్గుమంది. దేశంలో ఎవరైనా, ఏ భాషనైనా మాట్లాడవచ్చని.. హిందీయేతర భాషలు మాట్లాడే వారిపై బలవంతంగా హిందీని రుద్దడం ఆపాలని అన్నారు. మీరు అవమానించింది కేవలం రేవంత్ రెడ్డిని మాత్రమే కాదని.. తెలుగు మాట్లాడే వారితో పాటు, దేశంలోని హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలను అవమానిస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రేవంత్ ప్రశ్న ఏంటి? నిర్మలా సమాధానం ఏంటి?
లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రోజు రోజుకు రూపాయి విలువ పతనం అవుతుంటే మోడీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని అన్నారు. గతంలో డాలర్తో రూపాయి విలువ 69కి పడిపోయినప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ రూపాయి ఐసీయూలో పడిపోయిందని ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో రూపీ వ్యాల్యూ 82 దాటిపోయిందని విమర్శించారు. డాలర్తో పోల్చితే రూపాయి పతనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని రేవంత్ రెడ్డి సభలో ప్రశ్నించారు.
రేవంత్ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బదులిస్తూ.. కాంగ్రెస్ సభ్యుడు మోదీ వ్యాఖ్యలను ప్రస్తావించే ముందు నాటి ఆర్థిక సూచీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ సైతం ఐసీయూలో ఉందన్నారు. కానీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని చెప్పారు. కరోనా మహమ్మారి, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాలు చోటుచేసుకున్నా భారత్ రాణిస్తోందన్నారు. ఇందుకు గర్వించాల్సింది పోయి అసూయ చెందుతున్నారని నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు. ఈ సందర్భంలోనే హిందీ భాషపై వాళ్లిద్దరి మధ్య మాటకు మాట నడిచింది.