Sister Suicide After Celebrated Rakhi: రాఖీ పూర్ణిమ. అన్న చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని తెలిపే పండుగ. నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనం ఈ దేశానికి, ధర్మానికి రక్షగా నిలుద్దాం అంటూ.. ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఎన్నో ఏళ్లుగా శ్రావణ పూర్ణిమ రోజున ఈ పండుగను జరుపుకుంటున్నాం.
రాఖీ పండుగ రోజున నర్సింహులపేట మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. చదువులో రాణించి.. ఉన్నతస్థాయికి ఎదగాలనుకున్న ఓ యువతి కలలు.. యువకుడి వేధింపులకు బలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింపుల పేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (17) కోదాడలో డిప్లమో చదువుతోంది. రాఖీ పండుగకు ఇంటికి వచ్చిన ఆమె తన తమ్ముడికి, పెదనాన్న కొడుకుకి ముందురోజే రాఖీలు కట్టింది.
ఓ ఆకతాయి ప్రేమ పేరుతో వేధిస్తుండటంతో భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది. మనస్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మరణించింది. తమ్ముడు, అన్నలకు ముందుగానే రాఖీ కట్టిన ఆమె.. గంటల వ్యవధిలోనే ఇలా మరణించడం స్థానికులను కలచివేసింది. రాఖీ పండుగ వరకూ ఉంటానో లేదోనని ముందే ఆస్పత్రిలోనే రాఖీలు కట్టి వెళ్లిపోయిందంటూ తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు అందరిచేత కన్నీరు పెట్టించింది.