Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ మళ్లీ పాత తప్పులనే చేస్తోందా? జోష్ పెంచుతున్నదనుకున్న కార్యవర్గ ప్రకటన బూమరాంగ్ అయిందా? వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఈ జంబో జట్టు సరైనదేనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వయసుడిగిన గుర్రాలతో ఎన్నికల రేసు గెలవడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్గా 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. 24 మంది ఉపాధ్యక్షులు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 84 మంది ప్రధాన కార్యదర్శులతో జంబో కార్యవర్గాన్ని నియమించింది. ఈ నిర్ణయం కాంగ్రెస్ నేతలకే అంతుచుక్కని పరిణామం. ఇంతమంది జనరల్ సెక్రెట్రీలేంటి? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక పొలిటికల్ ఎఫైర్స్ కమిటీకి కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తారు. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.
జంబో టీమ్ పై కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాత టీమ్ నే చిన్నపాటి మార్పులు చేయడం తప్ప ఇందులో కొత్త దనమేముందని ప్రశ్నిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాల్సిన టీమ్ ఇలాగేనా ఉండేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డీసీసీ నియామకంపై కాంగ్రెస్ ఆశావహులు ఫుల్ గా డిసప్పాయింట్ అయ్యారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోరాడాలంటున్న అధిష్టానం.. ఆయన ముందుకు పోకుండా కాళ్లుపట్టి లాగుతున్నది సీనియర్ నేతలకు తిరిగి అవే పదవులు కట్టబెట్టడంలో అంతర్యమేంటి? టీమ్ లో మార్పులు లేకుండా.. ఎన్నికల్లో ఫలితాలు మారాలని ఎలా ఆశిస్తారు? అని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. తామంతా రేవంత్ రెడ్డి టీమ్ ను ఆశిస్తే.. అధిష్టానం ఏఐసీసీ టీమ్ ను ప్రకటించిందని ఆసహనం వ్యక్తంచేస్తున్నారు.
వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ కావడిని మోయగలిగేది రేవంత్ రెడ్డి మాత్రమేనని కార్యకర్తలు నమ్ముతున్నారు. రేవంత్ రెడ్డికి సీనియర్ నేతల నుంచి ఎలాంటి మద్దతు లేదన్నది బహిర్గతమే. తెలంగాణ ఇచ్చినా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయిన నేతలకే మళ్లీ పదవులు ఇవ్వడంలో ఆంతర్యమేంటి? హస్తం పార్టీకి పునర్ వైభవం తెచ్చేందుకు ఈ జట్టు సరిపోతుందా? ఇవే ప్రశ్నలు సంధిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ ప్రియాంకా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ కు మంచి విజయం దక్కింది. కాగా.. తెలంగాణ కాంగ్రెస్ ను కూడా ప్రియాంకాగాంధీనే సుపర్ వైజ్ చేయనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇది కాంగ్రెస్ కేడర్ లో ఆశలు రేకెత్తిస్తున్నా.. టీపీసీ కార్యవర్గ విస్తరణ చూశాక.. వారి జోష్ అంతా ఆవిరి అవుతున్నది. గతంలో జరిగిన తప్పులనే తిరిగి చేస్తూ.. ఎన్నికల్లో ఎలా గెలవగలం అన్నదే వారి సందేహం.