Raksha Bandhan 2024: అక్కాతమ్ముళ్లు..అన్నాచెల్లెళ్లు, తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకొనే పండుగ రాఖీ పౌర్ణమి. ఒకప్పుడు ఈ రాఖీ పౌర్ణమిని ఉత్తరాదిలో మాత్రమే జరిపేవారు. కాలక్రమేణా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈ వేడుకలు చేసుకోవడం ప్రారంభమయ్యాయి. రాఖీ పండుగ.. తోబుట్టువులతో ప్రేమగా మెలగాలని, పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండాలని సూచిస్తుంది.
సోదరి తన సోదరుడు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటే..సోదరి కట్టిన రక్షాబంధాన్ని స్వీకరించిన సోదరుడు తానెప్పుడూ సోదరికి రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు. సమాజంలో నానాటికి బంధాలు, అనుబంధాలు దూరమవుతున్న తరుణంలో రక్షాబంధన్ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాలను బలోపేతం చేస్తుంది.
ప్రస్తుతం ఆధునిక కాలంలో ఎక్కడా ఉన్నా తమ అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు అక్కాచెల్లెళ్లు తరలివస్తుంటారు. అలాగే విదేశాల్లో ఉన్న వారు సైతం కొరియర్ రూపంలో తమవారికి రాఖీలు పంపిస్తూ అనుబంధాలను చాటిచెబుతున్నారు. ఇంకా సోషల్ మీడియాలోనూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధాన్ని పెంచే ఈ పర్వదినాన ఏ సమయంలో రాఖీ కట్టాలి? ఏ సమయంలో రాఖీ కట్టకూడదు? అనే విషయాలపై పండితులు ఏం చెప్పారో తెలుసుకుందాం. సోమవారం ఉదయం శ్రావణమాసం శుక్ల పక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3.04 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు రాత్రి 11.55 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో భద్రకాలం కూడా వస్తుంది.
ఈ భద్ర కాలంలో రాఖీ కట్టకూడదని పండితులు చెబుతున్నారు. భద్రకాల సమయం ఉదయం 5.53 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.32 గంటల వరకు ఉంటుంది. అందుకే ఈ సమయం పూర్తయిన తర్వాత రాఖీ పండుగ చేసుకోవాలని చెబుతున్నారు.
Also Read: రాఖీ పండుగ రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఎక్కడో తెలుసా?
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..90 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది రాఖీ పండగ రోజున నాలుగు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో రాఖీ కట్టడం చాలా పవిత్రమైందిగా భావిస్తారు. అంటే సోమవారం మధ్యాహ్నం 1.33 గంటల నుంచి రాత్రి 9.08 గంటల వరకు శుభ సమయంగా చెబుతున్నారు. అదేవిధంగా రెండు ప్రత్యేకమైన ముహూర్తాలలో కడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయని, ఏడాదంతా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు.