KTR on Revanth Reddy Govt(Political news in telangana) : సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ బైపాస్ రోడ్డులో సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాపన్న గౌడ్ రాజ్యాధికారం కొరకు పాటుపడిన మహానుభావుడు అని కొనియాడారు. భారత దేశానికి స్వాతంత్ర్యం, తెలంగాణలో ఉన్న నిరంకుశ పాలనకు చరమగీతం పాడారని, ఆయన ఆశయాలను కొనసాగించాలన్న సంకల్పంతో గౌడన్నల సంక్షేమం కొరకు ఆనాడు కేసీఆర్ ఎన్నో మంచి పనులు చేశారని గుర్తు చేశారు. గౌడన్నల కొరకు చెట్లపై పన్నులు తీసివేసి వారి కుల వృత్తిని కాపాడామని తెలిపారు. గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించి వైన్ షాపులు కేటాయించామన్నారు కేటీఆర్.
గత ప్రభుత్వంలో నీరాను ప్రోత్సహించి ట్యాంక్ బండ్పై కేఫ్ పెట్టించినట్టు వివరించారు. తమ ప్రభుత్వంలో వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఆరున్నర లక్షల మంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించామని, సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసి, జనగామ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేటలో పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ ప్రభుత్వంలో పాపన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కల్లు డిపోలపై ఎక్సైజ్ వేధింపులు, అక్రమ కేసులు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవన్నీ చూస్తున్నామని విమర్శించారు. అక్రమ కేసులు పెడుతూ గీత కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు.