Trinamool MPRachana Banerjee Apologised: పశ్చిమ బెంగాల్ ఘటన దేశాన్ని కుదిపేసింది. మహిళలు, వైద్యులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. డాక్టర్లు తమ ఆసుపత్రుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆసుపత్రుల వద్ద వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి రోజుకో అంశం వెలుగులోకి వస్తుంది. అయితే, జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాలీ నటి రచనా బెనర్జీ ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో మృతురాలి పేరును ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి పేరును ప్రస్తావించినందుకు రచనాపై మండిపడ్డారు. ఆమెకు వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టారు. కోల్ కతా హైకోర్టుకు చెందిన ఓ న్యాయవాది ఆమెపై కోర్టులో ఫిర్యాదును దాఖలు చేశారు. ఎంపీ రచనా షేర్ చేసిన వీడియోలో బాధితురాలి పేరును పలుమార్లు పేర్కొన్నారని, దీని వల్ల బాధితురాలి కుటుంబం పడుతున్న బాధ మరింత తీవ్రమవుతుందంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: కోల్కతా హత్యాచారం కేసులో ఫేక్ న్యూస్.. బిజేపీ నాయకురాలు, డాక్టర్లకు నోటీసులు!
ఈ నేపథ్యంలో రచనా బెనర్జీ తన తప్పును అంగీకరించి బహిరంగ క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ వీడియోను తొలగించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇది ఖచ్చితంగా తన తప్పేనంటూ ఒప్పేసుకున్నారు. అలా చేయకుండా ఉండాల్సిందన్నారు. వీడియో తీస్తున్న క్రమంలో తాను భావోద్వేగానికి గురైనట్లు, అలా మాట్లాడుతుండగా అనుకోకుండా ఆమె పేరు వచ్చిందని చెప్పారు. ఇందుకు క్షమాపణలు కోరుతున్నానంటూ ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
మరోవైపు ఇదే ఘటనకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై ఓ బీజేపీ నేతకు, మరో ఇద్దరు వైద్యులకు కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విచారణకు హాజరుకావాలంటూ అందులో ఆదేశించింది.
Also Read: లేటరల్ రిక్రూట్మెంట్పై రాహుల్ ఫైర్.. ఆ పదవులకు దూరం చేయొద్దంటూ..
ఇదిలా ఉంటే.. ఈ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నది. మంగళవారు నుంచి ఈ కేసును సీజేఐ డీవై చండ్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారించనున్నది. సుప్రీంకోర్టు విచారణతో దర్యాప్తు మరింత వేగం సంతరించుకోవొచ్చు. దర్యాప్తు కోసం ప్రత్యేక కమిటీని లేదా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి పశ్చిబెంగాల్ లో ఆందోళనలు ఇంకా ఉధృతంగా సాగుతున్నాయి. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆసుపత్రి వద్ద వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హాస్పిటల్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు డ్యురండ్ కప్ మ్యాచ్ నేడు జరగాల్సి ఉంది. కానీ, నిరసకారులు అడ్డుకోవడంతో నిర్వాహకులు మ్యాచ్ ను రద్దు చేశారు.