Case Registered Against Fake Reporter, Remanded For 14 Days: తెలంగాణలో నకిలీ విలేకరి దందా జోరుగా సాగుతోంది. చోటా, మోటా.. ఛానళ్లు, ఈపేపర్లు పేర్లు చెప్పుకొని ఫేక్ ఐడీ కార్డులను సృష్టించుకుంటున్నారు. అంతేకాదు ఈ ఐడీ కార్డులను అడ్డం పెట్టుకుని దందా కొనసాగిస్తున్నారు. దీంతో అసలు విలేకరి ఎవరో… నకిలీ విలేకరి ఎవరో తెలియక కన్ప్యూజన్లో పడుతున్నారు జనాలు. దీంతో నకిలీ విలేకర్ల రాబడి కూడా మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్టుగా సాగుతోంది. ఈ మధ్య ఎక్కడ చూసినా సరే ఈ నకిలీ విలేకర్లమని చెప్పుకు తిరిగే వాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.
అంతేకాదు ఎదురు మాట్లాడితే.. పేపర్లో, ఛానళ్లలో వేయిస్తామని బెదిరిస్తున్నారు. వీరి ఆగడాలను తట్టుకోలేక ఎక్కడో ఒక చోట వీరి బాగోతం అక్కడక్కడ బాధితులు వాపోతూ బయటకు వస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా జన్నారంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. స్థానిక జన్నారంలోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ను డబ్బులు డిమాండ్ చేసిన నకిలీ స్టాఫ్ రిపోర్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాతంత్ర దినపత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అని చెప్పుకుంటూ స్థానిక జయరాణి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ హెడ్మాస్టర్ శ్రీరాముల మధుసూదన్కు ఈనెల 11న ఫోన్ చేసి రత్నం తిరుపతి అనే నకిలీ రిపోర్టర్ రూ. 5వేలు డిమాండ్ చేశాడు. దీంతో హెడ్మాస్టర్ మధుసూదన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read: వినాయక చవితికి పకడ్భందీ ఏర్పాట్లు, డేగ కళ్లతో నిఘా: మంత్రి పొన్నం
బాధితుడి ఫిర్యాదు మేరకు జన్నారం ఎస్సై గుండేటి రాజవర్ధన్ నకిలి విలేకరి రత్నం తిరుపతిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతడిని లక్షేటిపేట కోర్టులో బైండోవర్ చేశారు. విచారణ అనంతరం న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించి స్థానిక సబ్ నిందితుడిని జైలుకి తరలించారు పోలీసులు. అనంతరం సీఐ నరేందర్ మాట్లాడుతూ.. మీరంతా ఇలాంటి నకిలీ విలేకర్లమంటూ తిరిగే వారిపై మిగతా జర్నలిస్ట్లు ఓ కన్నేయాలంటూ సూచించారు. నకిలీ విలేకర్ల వల్ల అసలు వాళ్లకి మోసం కలిగే ఛాన్స్ ఉందంటూ వీరితో చాలా అప్రమత్తంగా ఉండాలని సీఐ నరేందర్ సూచించారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.