KTR Comments on Shamshabad Airport: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే ఇటీవలే పలు వ్యాఖ్యలు చేసి మహిళా లోకాగ్రహానికి గురైన విషయం తెలిసిందే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంపై ఆయన హేళనగా మాట్లాడడంతో మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. దిష్టిబొమ్మలు దహనం చేసి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ స్పందిస్తూ పొరపాటైందంటూ సోషల్ మీడియాలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ మహిళా నేతలు, కార్యకర్తలు స్పందిస్తూ పొరపాటైందని సోషల్ మీడియాలో చెప్పడంకాదు.. బహిరంగంగా చెప్పాలంటూ కేటీఆర్ పై ఫైరయ్యారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కట్టా రాగమయి మాట్లాడుతూ.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడరా? అంటూ ప్రశ్నించారు. ఆత్మగౌరవాన్ని ఎందుకు చంపుకుంటున్నారు.. బయటకు వచ్చి మీ వాదనను వినిపించండంటూ ఆమె సవాల్ విసిరారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని తప్పుబట్టారు కదా.. రాజకీయంగా జరిగిన సందర్భాన్ని సీఎం చాలా గౌరవంగా ప్రస్తావిస్తే.. అవమానించారు అన్నారు కదా..? కానీ, ఇప్పుడు మీ నాయకుడు కేటీఆర్ బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడెందుకు స్పందించడంలేదన్నారు. దమ్ముంటే కేటీఆర్ చంపలు వాయించి సారీ చెప్పించాలంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విధితమే.
మొత్తం కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. పలువురు మహిళలు కేటీఆర్ పై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇటు మహిళా కమిషన్ కూడా ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ కేటీఆర్ కు నోటీసులు పంపించింది. తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ అందలో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ వివాదం సర్దుమనుగకముందే కేటీఆర్ మరోసారి పలు వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టొద్దన్నారు. తాము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అయితే, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించామన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు.
Also Read: హైదరాబాద్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాలకు వెళ్తే బుక్కైపోతారు..!
తాము పదేళ్లపాటు అధికారంలో ఉన్నా కూడా రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు పేరును మార్చలేదన్నారు. కానీ, వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ గాంధీ పేరును తీసేసి పీవీ నరసింహారావు లేదా ప్రొఫేసర్ జయశంకర్ అని పేరు మారుస్తామన్నారు. అయితే, ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు దారి తీశాయి.
ఇదే విషయమై ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఎయిర్ పోర్టు పేరు మారుస్తామంటూ కేటీఆర్ చెబుతున్నారు. కానీ,.. ఎయిర్ పోర్టులకు పేరు మార్చే అధికారం రాష్ట్రాలకు ఉంటుందా..? లేదా కేంద్రానికి ఉంటుందా? అంటూ చర్చించుకుంటున్నారు.
మొత్తంగా కూడా కేటీఆర్ గత కొద్దిరోజుల నుంచి వ్యాఖ్యలు చేస్తూ ప్రజాగ్రహానికి గురవుతున్నారంటూ జనం అనుకుంటున్నారు.