Huge Traffic Jam in Hyderabad Due to Rain: రేపు రాఖీ పండుగ. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు షాకిచ్చింది వర్షం. చాలామంది హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో నగరంలో ఎక్కడా చూసినా కూడా దారులన్నీ వాహనాలతో బిజీ బిజీగా కనిపిస్తున్నాయి. అయితే, ఇలా వెళ్తున్న ప్రయాణిలకు వర్షం రూపంలో ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో పలు చోట్ల భారీగా వర్షం పడుతోంది. ఎల్బీనగర్, హయత్ నగర్, కోఠి, నాంపల్లి, సోమాజిగూడ, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నది. ఈ క్రమంలో ఆ ప్రాంతాల్లో వరద నీరు భారీగా రోడ్లపై వచ్చి చేరుతుంది. మోకాళ్ల వరకు నీళ్లు వచ్చి చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. చాదర్ ఘాట్ నుంచి ఎల్బీనగర్ వైపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. వివిధ చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వర్షం కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు అలర్ట్ అయ్యారు. ఎక్కడెక్కడైతే వరద నీరు వచ్చి చేరుతుందో అక్కడ క్లియర్ చేస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
ఇదిలా ఉంటే.. వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ వెల్లడించింది. అదేవిధంగా భారీగా గాలులు వీస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.