Mother Commits Suicide with her Two Children: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకు సంఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట జిల్లా ములుగు మండలానికి చెందిన మార్కంటి స్వామికి మెదక్ జిల్లా మనోహరాబాద్ కు చెందిన గుండ్ల భానుప్రియ(28)కు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆనంద్ (5), దీక్ష (4) అనే ఇద్దరు పిల్లలున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే.. కూతురు దీక్షకు పుట్టుకతోనే క్యాన్సర్ వచ్చింది. అప్పటి నుంచీ ఆ చిన్నారి ఆ వ్యాధితో పోరాడుతోంది.
కూలిపనులు చేసుకుంటూ బ్రతుకుతున్న ఆ దంపతులకు కూతురికి వైద్యం చేయించే స్తోమత లేకపోవడంతో తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీక్ష వైద్యానికి అయ్యే ఖర్చు భరించలేకపోవడంతో.. స్వామి, భానుప్రియల మధ్య గురువారం (ఆగస్టు 15) రాత్రి తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపం పట్టలేకపోయిన స్వామి.. భానుప్రియపై క్షణికావేశంలో చేయి చేసుకున్నాడు. మనస్తాపానికి గురైన భానుప్రియ శుక్రవారం ఉదయం తన ఇద్దరు పిల్లలను తీసుకుని బయటికి వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కంగారుపడిన స్వామి.. ములుగు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు.
శనివారం సాయంత్రం శామీర్ పేట పరిధిలో ఉన్న చెరువులో భానుప్రియ, దీక్ష ల మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాలుడు ఆనంద్ మృతదేహం లభ్యం కాలేదు. చీకటి పడటంతో సహాయక చర్యలు ఆపివేశారు. ఆదివారం బాలుడి మృతదేహం కోసం చెరువులో గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన శామీర్ పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.