Mythri: ఈడీ, ఐటీ, సీబీఐ రైడ్స్. కొన్నాళ్లుగా జాతీయ దర్యాప్తు సంస్థలు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా జీఎస్టీ రంగంలో దిగింది. సినిమా వాళ్లపై దాడి చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాలపై సోదాలు చేపట్టడం కలకలం రేపింది. ఇదేంటి? సడెన్ గా టాలీవుడ్ పై ఈ జీఎస్టీ రైడ్స్ ఏంటి? అనే చర్చ మొదలైంది. ఏదైనా సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయ్యాక జీఎస్టీ రైడ్స్ జరగడం మామూలే కానీ.. అనేక పెద్ద సినిమాలు నిర్మాణ దశలో ఉండంగా.. మైత్రీని టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కోణం ఉందా? అనే అనుమానం. ఈ దాడులను ఏపీ జీఎస్టీ లీడ్ చేస్తుండటం.. మైత్రీ ఖాతాలో పవన్ కల్యాణ్, బాలకృష్ణ, చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి బడా హీరోల సినిమాలు ఉండటంతో.. జీఎస్టీ, ఐటీ దాడుల వెనుక సంథింగ్ సంథింగ్ అనే డౌట్.
పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రారంభమైన మర్నాడే ఈ దాడులు జరగడం కాకతాళీయమా? కావాలనేనా? ఇక, సంక్రాంతికి బాలయ్య మూవీ వీరసింహారెడ్డి రిలీజ్ ఉంది. నిర్మాణాంతర పనులు వేగంగా జరుగుతున్న ఈ సమయంలో జీఎస్టీ సోదాలకు కారణమేంటి? సంక్రాంతి బరిలో దిగనున్న వాల్తేరు వీరయ్య కూడా మైత్రీదే కావడంతో మరింత అటెన్షన్. ఇలా, అన్నీ పెద్ద సినిమాలే.. అందరూ పెద్ద స్టార్లే.. అందులోనూ పవన్, బాలకృష్ణ లాంటి వైసీపీ వ్యతిరేక హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నందునే ఈ జీఎస్టీ, ఐటీ దాడులు జరిగాయా? అనే చర్చ మొదలైంది.
గతంలో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీ సమయంలో టికెట్ల ధరల తగ్గింపు అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది ఏపీ సర్కారు. అది పవర్ స్టార్ టార్గెట్ గానే జరిగిందనే ఆరోపణ ఉంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ అయిన మరుసటి రోజే మైత్రీ మూవీ మేకర్స్ పై ఏపీ జీఎస్టీ ఆధ్వర్యంలో తనిఖీలు జరగడం రాజకీయ చర్యేననే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇది పక్కా రాష్ట్ర పరిధిలో దాడులు జరిగాయా? లేదంటే, కేంద్రం డైరెక్షన్ లోనా? అనే క్లారిటీ వచ్చాకే ఇందులో పొలిటికల్ యాంగిల్ ఉందా? లేదా? అనేది తేలనుంది. అప్పటి వరకూ ఎవరి వాదన వారిదే..అంటున్నారు.