Records in ODIs :బంగ్లాదేశ్ పర్యటనలో తొలి రెండు వన్డేల్లో ఓడిపోయి సిరీస్ కోల్పోయిన టీమిండియా… మూడో వన్డేలో జూలు విదిల్చింది. ఏకంగా 400 పైచిలుకు స్కోరు చేసింది. వన్డే క్రికెట్లో 400 పరుగులకు పైగా స్కోరును ఆరుసార్లు చేసిన జట్టుగా నిలిచింది… భారత్. దక్షిణాఫ్రికా కూడా ఆరు సార్లు 400 రన్స్ చేసిన జట్టుగా టీమిండియా సరసన నిలిచింది.
వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటిదాకా 400 పైచిలుకు స్కోరు ఇప్పటిదాకా 22సార్లు నమోదైంది. అయితే వన్డేల్లో అత్యధిక రన్స్ రికార్డు ఇంగ్లాండ్ పేరు మీద ఉంది. ఈ ఏడాది జూన్లో నెదర్లాండ్స్ మీద 498 పరుగుల భారీ స్కోరు చేసింది… ఇంగ్లండ్. ఈ ఇన్నింగ్స్ లో ముగ్గురు ఇంగ్లండ్ బ్యాటర్లు సెంచరీలు బాదారు.
ఇక వన్డేల్లో టీమిండియా అత్యధిక స్కోరు 418. 2011లో ఇండోర్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఈ స్కోరు సాధించింది… భారత్. ఇదే మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరీ(219 రన్స్) చేశాడు.
2009లో శ్రీలంకతో రాజ్ కోట్ లో జరిగిన వన్డేలో భారత్ 414 రన్స్ చేసింది. ఈ మ్యాచ్లో సెహ్వాగ్ 146 పరుగులు చేయగా… గంగూలీ 89, యువరాజ్ సింగ్ 83, సచిన్ 53 రన్స్ చేశారు.
2007లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో బెర్ముడాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 413 రన్స్ చేసింది. ఈ మ్యాచ్లో కూడా సెహ్వాగ్ సెంచరీ(114 రన్స్) బాదేశాడు.
తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 409 రన్స్ చేసింది… భారత్. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ సెంచరీలు చేయడంతో… ఈ భారీ స్కోరు సాధ్యమైంది.
ఇక 2014లో శ్రీలంకపై భారత్ 404 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేయడమే కాకుండా… 264 పరుగులతో వన్డేల్లో టాప్ స్కోరర్గా నిలిచాడు.
ఇక గ్వాలియర్ వేదికగా 2010లో దక్షిణాఫ్రికాపై టీమిండియా 401 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో సచిన్ డబుల్ సెంచరీ చేశాడు. సరిగ్గా 200 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచిన సచిన్… ద్విశతకం సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా రికార్డులకెక్కాడు.