Raids on Hyderabad Pubs: తెలంగాణలో డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పెరుగుతున్న డ్రగ్ కల్చర్ నుంచి యువతను కాపాడేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ వినియోగం, గంజాయి తరలింపులపై పోలీస్ ఉన్నత అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 25 పబ్బుల్లో విజిలెన్స్ అండ్ నార్కోటిక్ అధికారులు గత రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. 25 ప్రత్యేక బృందాలు 25 బార్ అండ్ పబ్బులపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించాయి. హైదరాబాద్ లో 12, రంగారెడ్డి జిల్లాలో 13 బార్లు పబ్బులపై శనివారం రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకూ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. డ్రగ్స్ వినియోగంపై 12 ప్యానెల్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ తో పరీక్షలు నిర్వహించారు. వారిలో 50 మందికి పైగా డ్రగ్స్ సేవించినట్లు పాజిటివ్ గా తేలింది. వారందరినీ పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: డ్రగ్స్ కేసులో వామ్మో..ఇంత మంది సెలబ్రిటీలా?
ఇదిలా ఉండగా.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఎన్ఎల్ షాపింగ్ మాల్ వద్ద మందుబాబులు హల్ చల్ చేశారు. అర్థరాత్రి 1 గంట దాటిన తర్వాత పబ్బులో తాగి వీరంగం సృష్టించారు. వీకెండ్ అవడంతో పబ్బుల్లో జనాలు కిటకిటలాడారు. మద్యం మత్తులో అమ్మాయిని వేధించారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇరువర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ.. పరస్పర దాడులకు దారి తీసింది. కొందరు తమపట్ల అసభ్యంగా ప్రవర్తించారని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని గచ్చిబౌలి పోలీసులు చెబుతున్నారు.