Humans Aging Fast| మనిషి వయసు.. అతను పుట్టినప్పటి నుంచి ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం. కానీ పసితనం నుంచి బాల్యం లోకి, బాల్యం నుంచి యుక్త వయసుకి శరీరంలో మార్పులు జరిగినట్లే యవ్వనం నుంచి వృద్ధాప్యంలోకి మారేందుకు కూడా శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మార్పు ప్రతిరోజు చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది అని ఇంతకాలం అందరూ భావించారు. కానీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఒక కొత్త విషయం తెలిసింది. ప్రతీ మనిషి తన జీవితకాలంలో రెండు సార్లు మాత్రమే వేగంగా ముసలివాడైపోతాడు అని తేలింది.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని స్టాన్ ఫోర్ట్ యునివర్సిటికి చెందిన కొంత మంది శాస్త్రవేత్తలు మనిషికి ఎలా వృద్ధాప్యం వస్తుంది.. ఏ వయసులో త్వరగా వస్తుందనే అంశాలపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధన రిపోర్ట్ ని నేచర్ ఏజియింగ్ అనే సైంటిఫక్ జర్నల్ లో పబ్లిష్ చేశారు. పరిశోధన రిపోర్ట్ లో ఆశ్చర్యకర విషయాలు ఉన్నాయి.
రిపోర్ట్ ప్రకారం.. స్టాన్ ఫోర్డ్ శాస్త్రవేత్తలు 108 మందిపై పరిశోధన చేశారు. వీరంతా 25 నుంచి 75 సంవత్సరాల వయసు కలవారు. వీరిందరి రక్తం, మలం, చర్మం, నోరు, ముక్కు భాగాలను 20 నెలలపాటు పలుమార్లు పరీక్షించారు. అయితే ఈ పరీక్షల్లో ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. మనుషులకు ముసలితనం 44, 60 ఏళ్ల వయసున్నప్పుడు వేగంగా సోకుతుందని తెలిసింది. ఇదంతా శరీరంలో మాలిక్యూల్స్ లో వచ్చే మార్పుల వల్లే జరుగుతోందని తెలిపారు.
ఉదాహరణకు 60 ఏళ్ల వయసున్నప్పుడు శరీరంలోని రోగనిరోధక శక్తి అందరికీ తగ్గిపోతుంది. దీనికి కారణం.. శరీరంలో కార్బోహైడ్రేట్స్ ప్రాసెసింగ్ జరగడం. అలాగే 44 ఏళ్ల వయసు వచ్చేసరికి.. మనిషికి గుండె సంబంధిత సమస్యలు మొదలవడం, మద్యం సేవించడంతో ఆరోగ్యంపై ప్రభావం పడడం లాంటివి జరుగుతుండడంతో శరీరం వేగంగా వృద్ధాప్యం వైపు పరుగులు తీస్తుంది. పరిశోధనలో తెలిసిన విషయాలను బట్టి అర్థమయ్యేది ఒక్కటే. శరీరంలో మార్పులు క్రమంగా జరిగేవి కావని.. ఒక దశ వచ్చేసరికి వేగంగా జరుగుతాయని.
ఈ రీసెర్చ్ సహాయంతో మానవ శరీరంతో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలపై మరింత అవగాహన కలుగుతుందని సైంటిస్ట్స్ అభిప్రాయపడ్డారు. కొందరికి పార్కిన్సన్స్ లాంటి నరాల సంబంధిత ఆరోగ్య సమస్య, అల్జీమర్స్ లాంటి మతిమరుపు సమస్యలు కూడా వయసు మీరే కొద్ది బయటపడతాయని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. సైన్స్ ప్రకారం.. శరీరంలో సెల్(కణాలు) పనితీరు తగ్గిపోవడమే వయసు మళ్లడానికి ప్రధాన కారణం. ఎక్కువగా ఎండలో తిరగడం, పోషకాహార లోపం ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. శరీరంలోని కణాలు దెబ్బతినడం, అవి పని చేయకపోవడంతో వృద్ధాప్యంతో పాటు ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ఫలితంగా మనిషి వేగంగా ముసలివాడవుతాడు.
ఈ పరిశోధన ఫలితాలు వెలుగులోకి వచ్చాక.. మనుషులు తమ జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉదాహరణకు 40 ఏళ్లకే ముసలితనం మొదలవుతుందని తెలిస్తే.. మంచి సమతుల్యమైన పోషకాహారంతో, నిత్యం యోగా, జిమ్ లాంటివి చేస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ సమస్యను వాయిదా వేయొచ్చు.
అయితే ఈ పరిశోధన కేవలం అమెరికాలోని క్యాలిఫోర్నియా వాసులపై మాత్రమే చేయడంతో దీని ఫలితాలపై నిపుణులు సంతృప్తికరంగా లేరు. భవిష్యత్తులో ఈ పరిశోధనను విస్తృతస్థాయిలో చేయాల్సిన అవసరముందని అప్పుడే మరింత లోతుగా అధ్యయనం చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?