Defense Arrangements For Vinayaka Chaviti, Surveillance With Eagle Eyes: Minister Ponnam: వినాయక చవితి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల్లో వినాయక చవితి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటినుండే సందడి వాతావరణం నెలకొంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సి్ంది హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి. ప్రతి ఏడాది భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. అంతేకాకుండా ఈ మహాగణపతిని దర్శించుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రజలతో పాటుగా ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇక భాగ్యనగరంలోని వాడవాడలా వినాయకుడి మంటపాలను నిర్వాహకులు ఎంతో అందంగా ఏర్పాటు చేసి బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసి, కోలాహలంగా చెరువులు కుంటలలో నిమజ్జనం చేస్తారు.
ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని శాఖల అధికారులతో రివ్యూ చేశారు. విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపై చర్చించారు. జీహెచ్ఎంసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, హెచ్ఎండీఏ నుంచి మట్టి విగ్రహాల పంపిణీపై మంత్రి ఆరా తీశారు. సమావేశం అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో మీటింగ్ నిర్వహించినట్టు తెలిపారు.రాబోయే వారం రోజుల్లో ప్రజా ప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. తాజాగా ఇంటర్నల్ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిందని అన్నారు.
Also Read: మెట్రో సరికొత్త ప్లాన్- ఇక అక్కడికీ రవాణా సేవలను విస్తరించే ఆలోచనలో సీఎం రేవంత్రెడ్డి
గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది అలా జరగకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. దేశంలోని ముంబై మహానగరం తరువాత హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని పొన్నం ప్రభాకర్ అన్నారు. బోనాలు ఎలా అయితే ఘనంగా జరుపుకున్నామో, అలాగే ఈ గణేష్ నిమజ్జన ఉత్సవాలు కూడా ప్రశాంతంగా జరిగేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ ఇమేజ్ను మరింత పెంచి ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇక హుస్సేన్ సాగర్లో విగ్రహాల నిమజ్జనం అనేది కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ సిటీ పోలీసులు నిరంతరం సీసీ కెమెరాలతో నిఘాని ఏర్పాటు చేసి 24 గంటల పాటు వారి పరిధిలో జంటనగరాలు ఉండనున్నాయని అన్నారు. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకోవాలని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా గణేషుడి నిమజ్జనాలు జరుపుకోవాలని రాష్ట్ర డీజీపీ ప్రజలను కోరారు.