Nirbhaya’s Mother: కోల్కతాలోని జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు, డాక్టర్లు ఆందోళనలు చేస్తున్నారు. దేశమంతటా ఆసుపత్రుల వద్ద వైద్యులు నిరసనలు చేస్తున్నారు. ప్రతి చోటా ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. ఆసుపత్రుల్లో డ్యూటీలు చేయాలంటేనే భయం వేస్తోందంటూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటనలో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో నిర్భయ తల్లి ఆశాదేవి కూడా ఈ ఘటనపై స్పందించారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: అవన్నీ అబద్ధాలే.. కోల్కతా డాక్టర్ కేసులో ఊహించని ట్విస్ట్, పోలీసులు ఏమన్నారంటే..?
ఈ ఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ కోల్ కతాలో వైద్యులు నిరసనలు చేప్పటిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కోల్ కతాలో ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశాదేవి మండిపడ్డారు. ‘ఒక యువతికి అన్యాయం జరిగింది. ఆ అమ్మాయికి న్యాయం చేసేందుకు దోషులపై చర్యలు తీసుకోవడానికి మమతా బెనర్జీకి ఒక సీఎంగా అధికారం ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించి వారిపై చర్యలు తీసుకోవొచ్చు. కానీ, ఆమె అలా చేయడంలేదు. అలా చేయకుండా అందుకు బదులుగా నిరసనలో పాల్గొన్నారు. ఇదంతా కూడా కేవలం అసలు సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆమె అలా ప్రయత్నిస్తున్నారు’ అంటూ నిర్భయ తల్లి పేర్కొన్నది.
‘మమతా బెనర్జీ ఒక రాష్ట్రానికి సీఎం.. అంటే రాష్ట్ర అధినేత స్థానంలో ఆమె ఉన్నారు. అందువల్ల ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ, ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో విఫలమైనందుకు ఆమె వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలి. కోల్ కతా మెడికల్ కాలేజీలో అమ్మాయిలకు రక్షణ లేదు. అమ్మాయిల పట్ల కొందరు రాక్షసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. దేశంలో మహిళలకు భద్రత ఏ స్థాయిలో ఉందో అనేది ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని తీవ్రంగా పరిగణించాలి. జూనియర్ డాక్టర్ కు ఈ పరిస్థితి కల్పించిన దుండగులను కఠినంగా శిక్షించాలి. లేకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి’ అంటూ ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు.
Also Read: కర్ణాటక సిఎం సిద్దరామయ్య కుటుంబంపై అవినీతి కేసు.. విచారణకు అనుమతిచ్చిన గవర్నర్!
ఇదిలా ఉంటే.. కోల్ కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది. అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా భారీగా నిరసనలు కొనసాగుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే జరిగిన నిరసనకు మమతా బెనర్జీ నాయకత్వం వహించారు. ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి ఆశాదేవి.. పై విధంగా వ్యాఖ్యలు చేశారు.