Bhupendra Patel : అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తొలిసారే ముఖ్యమంత్రి అయ్యారు. వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనే గుజరాత్ కొత్త సీఎం భూపేంద్ర పటేల్. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టారు.
2021 సెప్టెంబర్ లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ రూపానీని అనూహ్యంగా ఆ పదవి నుంచి బీజేపీ అధిష్టానం తొలగించింది. సీఎం రేసులో అనేక మంది సీనియర్ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని భూపేంద్ర పటేల్కు సీఎం బాధ్యతలను బీజేపీ అధిష్టానం అప్పగించింది. అప్పటికి భూపేంద్ర పటేల్ ఎమ్మెల్యేగా ఎన్నికైంది ఒక్కసారే. ఎమ్మెల్యేగా నాలుగేళ్ల మాత్రమే అనుభవం ఉన్న భూపేంద్ర పటేల్ కు సీఎం పదవి వరించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
మోదీ రికార్డు బద్దలు..
2002లో నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ 127 స్థానాల్లో విజయం సాధించింది. మొన్నటి ఎన్నికల వరకు బీజేపీకి ఇదే రికార్డు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ ఆ రికార్డును బద్దలుకొట్టారు. ఈ సారి 156 స్థానాల్లో బీజేపీ గెలిచింది. మోదీకి, భూపేంద్ర పటేల్కు మరో సారూప్యత ఉంది. పటేల్ ఎలాంటి మంత్రి పదవి చేపట్టకుండానే సీఎం బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో మోదీ కూడా ఎలాంటి మంత్రి పదవి చేపట్టకుండానే గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు.
ఐదో పటేల్..
భూపేంద్ర పటేల్కు సీఎం పగ్గాలు అప్పగించడానికి ప్రధాన కారణం గుజరాత్లో జరిగిన పాటీదార్ల ఆందోళనేనని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజా ఎన్నికల్లో పాటీదార్ల ప్రాబల్యమున్న స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అందుకే రెండోసారి ఆయనకే సీఎం బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం. పటేల్ వర్గం నుంచి ఇప్పటి వరకు ఐదుగురు ముఖ్యమంత్రులయ్యారు.. అంతకుముందు ఆనందీబెన్ పటేల్, కేశుభాయ్ పటేల్, బాబుభాయ్ పటేల్, చిమన్భాయ్ పటేల్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
గుజరాత్ మాజీ సీఎం, ప్రస్తుత యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గతంలో ప్రాతినిధ్యం వహించిన ఘట్లోడియా నియోజకవర్గం నుంచి 2017లో పోటీ చేసి భూపేంద్ర పటేల్ 1.17 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యే ఆయనే. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఘట్లోడియా స్థానం నుంచి 1.92 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి గత రికార్డును బ్రేక్ చేశారు. అంటే ఒక ఎంపీకి వచ్చే మెజార్టీ ఎమ్మెల్యేకు రావడం అద్భుతమే. అంటే నియోజకవర్గంలో ఆయన ఎంత పట్టు సాధించారనేదానికి ఎన్నికల్లో వచ్చిన మెజార్టీలే నిదర్శనం. ఇప్పుడు పార్టీకి కూడా అదే రేంజ్ లో విజయాన్ని అందించారు.
60 ఏళ్ల భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్లో జన్మించారు. అక్కడి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్లో డిప్లొమా చేశారు. విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది. రాజకీయాల్లోకి రాకముందు నిర్మాణ రంగ వ్యాపారం నిర్వహించేవారు. ఆ తర్వాత అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా, పురపాలక స్థాయీ సంఘం ఛైర్మన్గా, మున్సిపల్ పాఠశాలల కమిటీ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఆయన మృదుభాషి. అందరూ దాదా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. పటేల్పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. బీజేపీలో ట్రబుల్ షూటర్, వ్యూహకర్తగా పేరుంది. ఇలా క్లీన్ ఇమేజ్ ఉందికాబట్టే భూపేంద్ర పటేల్ ను రెండోసారి సీఎం పదవి వరించింది.