Kolkata RG Kar hospital Doctor rape-murder Incident: పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్ కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న యువ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తుంది. దేశమంతా మహిళలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. వైద్యులు సమ్మె చేస్తున్నారు. ఘోరమైన ఈ ఘటన ప్రజలను కలవర పెట్టడమే కాకుండా ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో పలు వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కోలకతా ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇవేనంటూ వాటిని నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు. వీటిపై సంబంధిత అధికారులు స్పందించారు. ఆ దృశ్యాలు సంబంధిత అధికార మూలాల నుంచి వచ్చినవి కాదంటూ పోలీసులు చెబుతున్నారు.
ఇందుకు సంబంధించి పోలీసులు ఈ విధంగా పేర్కొన్నారు. మెజిస్ట్రేట్ ఎదుటే మృతురాలి పోస్టుమార్టం నిర్వహించగా, ఆ ప్రక్రియను వీడియో తీసినట్లు చెప్పారు. అయితే, అందులో ఎక్కడా కూడా ఆమె శరీరంలో ఎముకలు విరిగినట్లు ప్రస్తావించలేదన్నారు.
Also Read: బీహార్లో కూలిన మరో వంతెన.. ఇప్పటికి ఇది మూడోసారి
ఒక దశలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందన్న వార్తలు కూడా వచ్చాయి. ఆమె శరీరంలోని 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించారనేది వాటి సారాంశం. ఆమె తల్లిదండ్రులు కోర్టులో వేసిన పిటిషనే ఈ సమాచారానికి మూలమంటూ పలు కథనాలు కూడా ఉటంకించాయి. వీటిపై కోల్ కతా పోలీస్ చీఫ్ వినేష్ గోయల్ మాట్లాడారు.
‘150 ఎంజీ వీర్యం గుర్తించినట్లు కొందరు చెబుతున్నారు. వారికి ఈ సమాచారం ఎక్కడ దొరికిందో అర్థం కావడంలేదు. ఇది మీడియాలో పలు విధాలుగా చక్కర్లు కొడుతుంది. ప్రజల్లో గందరగోళ వాతావరణం సృష్టించేందుకు ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
అయితే, జూనియర్ వైద్యురాలి మృతి ఘటనను అసహజ మరణంగా నమోదు చేయడంపై పలు అనుమానాలకు తావిస్తుందంటూ కోల్కతా హైకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా ఆసుపత్రి యంత్రాంగం కూడా కేసు నమోదు చేయకపోవడాన్ని కూడా ప్రశ్నించింది. మృతి ఘటనకు సంబంధించి అసహజ మరణంగా కేసు నమోదు చేయడంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై కూడా గోయల్ స్పందించారు.
‘ఎటువంటి ఫిర్యాదులు రానప్పుడు అలా కేసు నమోదు చేయడం చాలా సహజం. అసహజ మరణంగా కేసు నమోదు చేయడం ద్వారా విషయాన్ని దాచిపెట్టి, ఆత్మహత్యగా చూపించాలని అనుకుంటున్నామని ఎందుకు చెబుతున్నారో’ అంటూ ఆయన ఫైరయ్యారు.
Also Read: కర్ణాటక సిఎం సిద్దరామయ్య కుటుంబంపై అవినీతి కేసు.. విచారణకు అనుమతిచ్చిన గవర్నర్!
కాగా, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పలు పోస్టులు సహచర వైద్యులను అనుమానితులుగా పేర్కొంటున్నాయి. మృతురాలి తల్లిదండ్రులు పలు పేర్లతో కూడిన జాబితాను సీబీఐకి ఇచ్చినట్లు అందులో పేర్కొన్నాయి. ఒక్క వాలంటీర్ పేరు తప్ప ఇప్పటివరకు ఏ ఏజెన్సీ కూడా ఇతర అనుమానితుల పేర్లను రికార్డుల్లో నమోదు చేయలేదు. అలాగే ఈ కేసులో పెద్ద వ్యక్తుల జోక్యం ఉందంటూ వచ్చిన వార్తలను సైతం తోసిపుచ్చారు.
ఇక, ఆ జూనియర్ డాక్టర్ పేరుతో ఉన్న ధృవీకరించని ఒక ప్రిస్క్రిప్షన్ కాపీ కూడా వైరల్ అయ్యింది. ఈ లీక్.. అత్యాచార కేసుల్లో బాధితురాలికి సంబంధించి ఎటువంటి వివరాలు బయటకు వెల్లడించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ కేసును కోల్ కతా హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో, సీబీఐ విచారణ కొనసాగిస్తున్నది.