Rahul Gandhi: రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని విజయవంతంగా నిలువరించగలిగామని, సోషల్ మీడియాను ఉపయోగించి బీజేపీ సీట్లకు గండికొట్టామని వివరించారు. ఈ సారి ప్రధానిగా నరేంద్ర మోదీ అయ్యారని, కానీ, వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపడుతారని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని వివరించారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కృషి చేయాలని, ముఖ్యంగా సోషల్ మీడియాపై కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కువ ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని సోషల్ మీడియా సోల్జర్లను ఉద్దేశించి కామెంట్ చేశారు. అయితే, తాను మాత్రం సోషల్ మీడియా గురించి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నట్టు వివరించారు.
గత లోక్ సభ ఎన్నికల్లో సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించి బీజేపీ సీట్లు తగ్గేలా చేయగలిగామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నేటి తరం ప్రజలకు చేరువ కావాలంటే సోషల్ మీడియా బలమైన సాధనం అని వివరించారు. ప్రధాని మోదీ మీడియా సంస్థలను మూసేయగలిగారని, కానీ, సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేకపోయారని పేర్కొన్నారు. కాబట్టి, సోషల్ మీడియాను కాంగ్రెస్ సమర్థవంతంగా వినియోగించుకోవాలని పిలుపు ఇచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని కాకుండా ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
Also Read: Brawl in Parliament: బ్రేకింగ్ న్యూస్.. పార్లమెంటులో కొట్టుకున్న ఎంపీలు.. రక్తం కారుతున్నా కూడా..
సోషల్ మీడియా ప్రాధాన్యతను వివరిస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారికి పార్టీలో సరైన ప్రాధాన్యత ఉంటుందని, ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు ఒక సోషల్ మీడియా సోల్జర్ను నియమించాలని మంత్రి ఉత్తమ్ చెప్పారు. కాంగ్రెస్ మండల, గ్రామాధ్యక్షులు ఈ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే, మహిళలు, మహిళా సంఘాల సభ్యులను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంచాలని వివరించారు. సోషల్ మీడియాపై నాలెడ్జ్ లేని నాయకులకు టికెట్ దొరకడం కష్టమేనని తెలిపారు.
కోదాడ, హుజుర్నగర్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సోషల్ మీడియాలో పెద్దగా ప్రచారం చేయడం లేదని.. ఇక నుంచి క్షేత్రస్థాయి నాయకులు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.