Turkish Parliament: పార్లమెంటు అంటే ఏ దేశానికైనా అదొక దేవాలయంగా భావిస్తారు. అందులో ప్రతి ఒక్కరూ నియమాలకు లోబడి వ్యవహరిస్తారు. అయితే, టర్కీ పార్లమెంటులో మాత్రం ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చట్టాలు చేసే ప్రజాప్రతినిధులే కొట్టుకున్నారు. అదీ ఒక్కరిద్దరు కాదు.. ఏకంగా ఒక డజను మంది ఎంపీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రక్తం కారుతున్నా కూడా ఆగిపోకుండా దాడి చేసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చినీయాంశమయ్యింది. చట్టసభలో ప్రజాప్రతినిధులు వ్యవహరించే తీరు ఇదేనా? అంటూ సదరు ఎంపీలను ప్రశ్నిస్తున్నారు.
ఇందుకు సంబంధించి అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం… టర్కీలో పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష ఎంపీ కెన్ అటలే విషయమై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
Also Read: దాడులకు భయపడి అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయిన బంగ్లాదేశ్ నటి
అయితే, గేజి పార్కు కేసులో అటలేతో పాటు ఏడుగురికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆయన జైలులో ఉన్నారు. 48 ఏళ్ల వయసున్న అటలే జైలు నుంచే గత మే లో అక్కడ జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో హటే ప్రావిన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తూ ఎంపీగా పోటీ చేశారు. అతను పార్లమెంటులో మూడు సీట్లను కలిగి ఉన్న లెఫ్టిస్ట్ వర్కర్స్ పార్టీ ఆఫ్ టర్కీ తరఫున పార్లమెంటుకు ఎంపికయ్యాడు. అయితే, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను నిర్వహించే ఆరోపణలపై జైలుకెళ్లిన కెన్ అటలేను పార్లమెంటులోకి అనుమతించబోమంటూ అధికార పార్టీ ఏకేపీ సభ్యులు పిలుపునిచ్చారు. దీనిపై ప్రతిపక్ష అభ్యర్థి అహ్మద్ సిక్ ప్రశ్నించారు. ‘మీరు అతలాయ్ ను ఉగ్రవాది అని పిలవడం మాకు ఆశ్చర్యం కలిగించదు.. మీ పక్షం వహించని ప్రతి ఒక్కరినీ మీరు చేసినట్లు.. కానీ, ఈ సీట్లలో కూర్చున్నవారే అతిపెద్ద ఉగ్రవాదులు..అధికార పార్టీనే ఉగ్రవాద సంస్థ’ అంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో ఏకేపీ సభ్యులలో ఒకరు ఆయనపై పిడిగుద్దులు గుద్దారు. మిగతా పలువురు ఎంపీలు కూడా గొడవకు దిగారు. ఇలా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రక్తం కారుతున్నా కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మొత్తంగా పార్లమెంటు ఎంపీల గొడవతో దద్దరిల్లింది. ఈ గొడవలో మహిళా సభ్యురాలికి కూడా గాయమైనట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణ వాతావరణం తరువాత డిప్యూటీ స్పీకర్ సమావేశాలను వాయిదా వేశారు. మూడు గంటలకు పైగా విరామం తరువాత సభ తిరిగి ప్రారంభమయ్యింది. సభలో కొట్టుకున్నవారిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: ‘ఇక మూడో ప్రపంచ యుద్ధమే’.. రష్యా పట్టణాన్ని ఆక్రమించుకున్న యుక్రెయిన్..
ప్రతిపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఓజ్ గుర్ ఓజెల్ దీనిపై స్పందించారు. పార్లమెంటులో ఈ విధంగా సంఘటన చోటు చేసుకోవడం సిగ్గు చేటు అంటూ ఆయన మండిపడ్డారు. ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా దాడులు చేస్తారా? రక్తం కారుతున్నా వదలకుండా దాడులు చేస్తారా? మహిళా సభ్యులపై కూడా దాడులు చేయడం సరికాదు. దాడులతో ప్రతిపక్ష సభ్యుల నోరు మూయించాలని ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. పార్లమెంటులో ఘర్షణకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. స్పీకర్ పోడియం వద్ద ఎంపీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి.