CM Siddaramaiah Corruption | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యని అవినీతి కేసులో విచారణ చేసేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ శనివారం అనుమతులిచ్చారు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూముల కేటాయింపుల్లో అవతవకలు జరిగాయని.. సిఎం సిద్దరామయ్య, ఆయన భార్య ఈ భూకుంభకోణం చేశారని ముగ్గురు సామాజిక కార్యకర్తలు ఇంతకుముందే గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులను విచారణ చేసేందుకు ఆదేశించాలని గవర్నర్ను కోరారు. వారి పిటీషన్లపై స్పందించిన గవర్నర్ గెహ్లోట్ ముఖ్యమంత్రి, ఆయన భార్యకు కొన్ని రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులపై అధికారికంగా ఇంతవరకూ స్పందించకపోవడంతో గవర్నర్ విచారణకు అనుమతులిచ్చారు. దీంతో ఇప్పుడు కర్ణాటనక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
అవినీతి నిరోధక చట్టం 1988, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 చట్టం, సెక్షన్ 218 ప్రకారం.. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ను అవినీతి కేసులో విచారణ చేసేందుకు అనుమతిలివ్వడం జరిగిందని గవర్నర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసుల అందుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ధృవీకరించారు.
గవర్నర్ అనుమతులివ్వడంతో బిజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ”ముఖ్యమంత్రి, ఆయన బంధువులు అవినీతి పాల్పడ్డారనేందుకు కావాల్సిన ఆధారులున్నాయి. సిద్దరామయ్య ఇంతకాలం తనను ఎవరూ ఎదిరించే వారే లేరని గర్వంగా ఉన్నారు. కానీ ఇప్పుడు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం,” అని కర్ణాటక బిజేపీ అధ్యక్షడు బివై విజయేంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read: ఒక్క రోజులో 10 అంతస్తుల భవన నిర్మాణం పూర్తి.. అంతా చైనా మహిమ!
అయితే ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు గవర్నర్ చర్యలను తప్పుబట్టారు. రాజకీయ కక్షలు సాధించడానికే ఈ కేసు పెట్టారని.. అంతేగాని ఈ కేసులో ఏ ఆధారాలు లేవని.. గవర్నర్ అనాలోచితంగా తొందరపడ్డారని మండిపడ్డారు. నిజంగా గవర్నర్ అవినీతి కేసుల్లో విచారణ చేయించాలంటే.. ఇంతవరకు మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమర స్వామి, మాజీ మంత్రులు శశికళ జొళ్లె, మురుగేశ్ నిరానీ లాంటి వారిపై ఎప్పటి నుంచో అవినీతి ఆరోపణలున్నాయి. మరి వారని విచారణ చేసేందుకు అనుమతులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
నెల రోజుల క్రితం ముగ్గురు సామాజిక కార్యకర్తలు ప్రదీప్ కుమార్, టిజె అబ్రహమ్, స్నేహమయి కృష్ణ… గవర్నర్ గెహ్లోట్ కు మైసూరులోని 14 ప్రభుత్వ భూములను చట్టవ్యతిరేకంగా ముఖ్యమంత్రి భార్య ఆక్రమించుకున్నారని.. ఈ కేసులో ముఖ్యమంత్రి, రెవిన్యూ అధికారులు కూడా భాగస్వాములని వారిని కూడా విచారణ చేయాలని కోరుతూ గవర్నర్ కు పిటీషన్లు పెట్టారు. ఈ పిటీషన్లపై ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గవర్నర్ షో కాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులు వెనక్కు తీసుకోవాలని కర్ణాటక మంత్రులు గవర్నర్ను కోరారు. ఇదంతా కుట్ర అని, రాజకీయ కక్ష కోసమే ఈ పిటీషన్లు పెట్టారని గవర్నర్ తెలిపారు. కానీ గవర్నర్ ప్రస్తుతం విచారణకు ఆదేశాలిచ్చారు.
2014లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య బావమరిది మల్లికార్జున.. నకిలీ డాక్యుమెంట్స్ చూపి రెవెన్యూ అధికారుల నుండి మైసూరులోని ప్రభుత్వ భూములను తన పేరున రిజిస్టర్ చేయించుకున్నారని.. అయితే రిజిస్ట్రేషన్ 1998లోనే జరిగినట్లు తేదీ మార్చారని పిటీషన్ లో సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు. నిజానికి ఆ భూమిని మల్లికార్జున 2004లోనే కబ్జా చేశారని తెలిపారు. రిజిస్ట్రేషన్ తరువాత భూమిని తన సోదరి, ముఖ్యమంత్రి భార్య పార్వతి పేరున బదిలీ చేశారని వెల్లడించారు. దీని వల్ల ప్రభుత్వానికి రూ.45 కోట్లు నష్టం జరిగిందని ఆరోపణలు చేశారు.
ఈ వ్యవహారంపై సిఎం సిద్దరామయ్య స్పందిస్తూ.. ఆ భూమి తన భార్యకు పుట్టింటి నుంచి కానుకగా లభించిందని.. అంతేతప్ప ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పారు. అయితే ఈ కేసులో ఇప్పటికే సిబిఐ విచారణ జరగాలని బిజేపీ డిమాండ్ చేస్తోంది.
Also Read: పారిస్లో ఉక్కపోతకు ఏసీ లేకపోతే నన్ను మీరంతా తిట్టుకున్నారా?’.. ఒలింపిక్ ఆటగాళ్లతో మోదీ సరదా!