Gas Cylinder Blast in Kadapa: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని తోగట వీధిలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతులు తల్లి రమాదేవి, కొడుకు ప్రభు మనోహర్, కూతురు మన్విత లుగా గుర్తించారు. ఆ ఇంటి నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రమాదేవి భర్త రాజా.. జీవనోపాధి కోసం కువైట్ కు వెళ్లి.. అక్కడే పనిచేస్తున్నాడు. రమాదేవి స్థానికంగా టైలరింగ్ పనిచేస్తూ.. పిల్లల్ని చూసుకుంటోందని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకునే సరికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. అప్పటికే ముగ్గురూ మరణించడంతో.. పోస్టుమార్టంకు తరలించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ప్రమాదవశాత్తు జరిగిందా ? లేక ఎవరైనా కావాలని చేశారా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు.
Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. మృతదేహాలకు నివాళులు అర్పించి.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించడం బాధాకరమన్నారు. అలాగే.. ఎవరికైనా ఎలాంటి సమస్యలున్నా వాటి పరిష్కార మార్గాలను చూడాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఈ ఘటనపై న్యాయవిచారణ చేయాలని, దీనికి వేరెవరైనా బాధ్యులైతే.. వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.