A serious accident to a school auto in Habsiguda student died: భాగ్యనగరంలో రోడ్డు యాక్సిడెంట్లు హడలెత్తిస్తున్నాయి. నిత్యం పాఠశాల విద్యార్థులు తిరిగే ప్రాంతాలలో సైతం వాహనాలు నిర్ణక్ష్యంతో నడుపుతున్నారు డ్రైవర్లు. ఆటో డ్రైవర్లు తమ ఆటోలను ఫ్లైట్ లా నడిపిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కనీసం ట్రాఫిక్ రూల్స్ కూడా వీరు పట్టించుకోరు. శనివారం హబ్సిగూడ ప్రాంతంలో ట్రక్కు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ ఓ బాలిక నిండు ప్రాణాన్ని బలిగొంది. స్కూలు పిల్లలు ఉన్న ఆటో వెనకనుంచి ట్రక్కు అతి వేగంతో ఢీకొనడంతో ముందు వెళుతున్న బస్సు వెనక చక్రాల కింద ఆటో ఇరుక్కుపోయింది. స్థానికులు ఆటోను బయటకు లాగడానికి ఎంతగా ప్రయత్నించినా వారి ప్రయత్నం వ్యర్థం అయింది. ఇంతలో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఆటోను బస్సు చక్రాల కింద నుంచి బయటకు లాగేందుకు క్రేన్ తెప్పించారు.
బస్సు చక్రాల కిందకు ఆటో
ఎట్టకేలకు శ్రమించి ఆటోను బస్సు చక్రాల కిందనుంచి బయటకు తీయగలిగారు. అయితే ఆటోలో తీవ్రగాయాలపాలైన విద్యార్థిని, డ్రైవర్ ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. తార్నాక గౌతమ్ మోడల్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న సాత్విక ఉదయం స్కూలుకెళ్లే క్రమంలో ఆటోని ఎక్కింది. ఆటో డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సాత్విక మృతి చెందిన వార్తను ఆమె తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యానికి పోలీసులు సమాచారం ఇచ్చారు. సాత్విక మృతితో తార్నాక కిమితి కాలనీలో విషాధ ఛాయలు అలుకున్నాయి. ఎప్పుడూ ఇల్లు, స్కూలు, చదువు తప్ప సాత్విక మరేదీ పట్టించుకోదని..సాత్వికంగా మాట్లాడుతూ అందరితో కలిసిపోయేదని తల్తిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఏవి?
తార్నాక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ కోలుకోగానే అతనిని కూడా అరెస్టు చేస్తామని అంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడం వలనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని..ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి రాష్ డ్రైవింగ్ లపై దృష్టిపెట్టాలని..జరిమానాలు, జైలు శిక్షలు కఠినంగా అమలు చేస్తే గానీ ఇలాంటివి పునరావృతం కావని అంటున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న సాత్విక ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమని సాత్విక ఫ్రెండ్స్, ఆమె సన్నిహితులు విలపిస్తున్నారు.