TCongress : అది అసలే కాంగ్రెస్. ఆ పార్టీలో నేతలకు స్వేచ్ఛ ఎక్కువ. తాము కోరుకున్న ప్రాధాన్యం దక్కకపోతే నేతలు వీధికెక్కడం ఈ పార్టీలో ఆనవాయితీ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో దశాబ్దాలుగా ఇదే సంప్రదాయం నడుస్తోంది. అదే కాంగ్రెస్ బలం.. అదే కాంగ్రెస్ బలహీనత. ఎందుకంటే చాలా మంది నేతలు పార్టీని ఎన్నోఏళ్లుగా అంటిపెట్టుకుని ఉన్నారంటే కారణం వాక్ స్వతంత్రం ఉండటమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో ఎంత అన్యాయం జరిగినా నోరువిప్పే పరిస్థితే ఉండదు. ఒకవేళ అలాంటి నేతలు బహిరంగంగా ఆ అంశాలపై మాట్లాడితే పార్టీ నుంచి వేటు పడటం ఖాయం. జాతీయ పార్టీ బీజేపీలోనూ నేతలకు వాక్ స్వతంత్రం పరిమితమే. కానీ కాంగ్రెస్ లో ఈ పరిస్థితి ఉండదు. ఎవరైనా సరే బహిరంగంగా తమ భావాలను వ్యక్తం చేసుకోవచ్చు. తమకు కావాల్సిన పదవి కోసం పోరాటం చేసుకోవచ్చు. అలాగే చాలామంది నేతలు ముఖ్యమంత్రులు, మంత్రులు అయ్యారు కూడా. తెలంగాణ కాంగ్రెస్ లో కొన్నాళ్లుగా నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పార్టీని ఒక్కతాటిపై నడిపించాల్సిన సీనియర్లే వీధికెక్కుతున్నారు. ఇది పార్టీకి చాలా సందర్భాల్లో తీవ్రం నష్టం కలిగిస్తోంది.
తాజాగా జరిగిన టీపీసీసీ కమిటీల కూర్పు కాంగ్రెస్ లో మరోసారి అగ్గిరాజేసింది. కమిటీలో స్థానం కల్పించకపోవడంపై చాలా మంది నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఒక్కొక్కరూ బయటకు వచ్చి తమ అసంతృప్తిని వెల్లగగ్గుతున్నారు. ఆదివారం టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా చేశారు. ఒక్కరోజు గడవక ముందే మరో నేత షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ తన పదవికి రాజీనామా చేశారు. తనకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
కొండా సురేఖ పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవికి రాజీనామా చేయడం వెనుక చాలా కారణాలున్నాయని తెలుస్తోంది. తనకంటే జూనియర్లు, పార్టీల మారిన వారికి రాజకీయ వ్యవహారాల కమిటీలో స్థానం కల్పించడంపై ఆమె జీర్ణించుకోలేపోతున్నారు. తనను ఎగ్జిక్యూటివ్ కమిటీకే పరిమిత చేయడం బాధ కలిగించిందని పైకి చెప్పినా.. రాజీనామా వెనుక స్థానిక రాజకీయ ప్రాధాన్యాంశాలే ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవి తన ముఖ్య అనుచరునికి ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ను సురేఖ కోరారని తెలుస్తోంది. కనీసం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని కోరారని సమాచారం.
వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవిపై కొండా మురళి, దొంతి మాధవరెడ్డి మధ్య పోటీ నెలకొంది. వరంగల్ తూర్పులో ముఖ్యమైన నాయకుడు పేరు సిఫారసు చేసినట్లుగా తెలిసింది. జనగామ డీసీసీ అధ్యక్ష పదవి కోసం జంగా, కొమ్మూరి మధ్య పోటీ నెలకొంది. జంగా రాఘవరెడ్డికి పదవి వచ్చేలా కొండా సురేఖ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తి రాగం వినిపించారనే మాటలు వినిపిస్తున్నాయి. అటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పీసీసీ కమిటీలో స్థానం దక్కకపోవడంపై అసంతృప్తిని ఇన్ డైరెక్ట్ గా వ్యక్తం చేశారు. ఇంకా ఎంతమంది నేతలు బయటకు వస్తారో అనే అనుమానాలున్నాయి. మరి పార్టీలో అసంతృప్తి జ్వాలలను కాంగ్రెస్ అధిష్టానం ఎలా చల్లార్చుతుందో చూడాలిమరి.