Bangladesh actress Rokeya Prachi attacked by mob goes underground: బంగ్లాదేశ్ లో శాంతిభద్రతలు చాలామటుకు నియంత్రణకు వచ్చనా కొన్ని చోట్ల మాత్రం ఇంకా హింసాత్మక సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. మైనారిటీ హిందువులపై దాడులు అరికట్టాలని భారత ఎంబసీ తో సహా భారతదేశంలోని భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, బీజేపీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ హింసాత్మక సంఘటనలు అరికట్టలేక షేక్ హసీనా ఆ దేశం నుంచి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ హసీనా మద్దతుదారులెవరైనా కనిపిస్తే ఆందోళనకారులు వారిపై అకారణంగా దాడులు చేస్తున్నారు. వారిని భయాందోళనలకు గురిచేస్తున్నారు. సెక్యూరిటీ లేనిదే బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందక్కడ. ప్రముఖ బంగ్లాదేశ్ నటి రోకియా ప్రాచీకి సరిగ్గా ఇలాంటి సంఘటనే ఎదురయింది.
భౌతిక దాడులు
ఆగస్టు 15 సందర్భంగా నటి ప్రాచీ మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ కు నివాళులర్పిద్దామని ఆయన పేరుతో ఏర్పడిన బంక్ బంధు రోడ్డు మీదుగా కారులో వస్తుండగా ఓ అల్లరి మూక ఆమె కారును చుట్టుముట్టారు. ఆమె చేతిలో ఉన్న కొన్ని పత్రాలు తీసుకుని చింపేశారు. భౌతికంగా ఆమెపై దాడి చేశారు. మహిళ అని చూడకుండా ఆమె బట్టలను కూడా చించేశారు. ఆమె ముందు అసభ్యకరమైన డ్యాన్సులు చేశారు. ప్రాణభయంతో ఎలాగోలా తప్పించుకుని బయటకొచ్చిన ప్రాచీ మీడియా సమావేశంలో తనపై జరిగిన దాడుల గురించి ప్రస్తావించారు.
ఇప్పటికీ నా మద్దతు హసీనాకే
తాను గతంలో షేక్ హసీనా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే తాను చేసిన తప్పా అని అడుగుతున్నారు. ఇప్పటికీ తన మద్దతు షేక్ హసీనాకే అని అంటున్నారు. కక్షకట్టిన జమాత్ ఇస్లామి ఉగ్ర సంస్థకు చెందిన టెర్రరిస్టులు తనలాంటి వారిపై దాడులు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికీ నా తలపై కత్తిపెట్టినా తుపాకీ గురిపెట్టినా రాజీ పడే ప్రసక్తే లేదని అంటున్నారామె. బంగ్లాదేశ్ లో ఇప్పటికే షేక్ హసీనా వర్గం చాలా మంది అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారని తమను కూడా పంపించేయాలని చూస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంతో తమలాంటి వారికి రక్ణణ కరువయిందని అంటున్నారామె. ప్రస్తుత ప్రభుత్వం శాంతిభద్రతలను అదుపుచెయ్యలేకపోతోందని ప్రాచీ అన్నారు.