Manish Sisodia| మరి కొన్ని నెలల్లో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా? అనే ప్రశ్నకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైన తరువాత సమాధానం లభిస్తుందని పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ సిసోదియా అన్నారు. శుక్రవారం ఆగస్టు 16 సాయంత్రం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఎన్నికల్లో ఇండియా కూటమి పాత్ర గురించి మాట్లాడారు.
లోక్ సభ 2024 ఎన్నికల్లో బిజేపీకి మెజారిటీ మార్క్ దాటకుండా ఆపడంలో ఇండియా కూటమి విజయం సాధించిందని, కానీ అసెంబ్లీ ఎన్నికలు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని సిసోదియా అభిప్రాయపడ్డారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో పొత్తుపెట్టుకొని పోటీ చేస్తుందా?’.. అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సిసోదియా స్పందిస్తూ.. ”అరవింద్ కేజ్రీవాల్ ఇంకా జైలులోనే ఉన్నారు. ఆయన త్వరలోనే బయటికొస్తారు. ఈ ప్రశ్నలకు ఆయనముందు మళ్లీ అడగండి, అప్పుడు సమాధానం దొరుకుతుంది. ఢిల్లీ ఎన్నికలే కాదు.. హర్యాణా ఎన్నికల్లో కూడా ఆప్, కాంగ్రెస్ పొత్తు గురించి కేజ్రీవాల్ మాత్రమే చెప్పగలరు” అని చెప్పారు.
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు అవకాశాలెంత? అని మీడియా ప్రశ్నించింది. సిసోదియా సమాధానమిస్తూ.. ఢిల్లీ ప్రజలు తమ వైపు ఉన్నారని.. అయితే ఎన్నికలు ఎప్పుడూ ఈజీ కాదని చెప్పారు. ప్రతిసారి ఎన్నికల్లో సమకాలీన సమస్యలుంటాయని.. ఈ సారి కూడా ఢిల్లీ ఎన్నికల్లో వచ్చే సవాళ్లను ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 2025లో జరగబోయే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను 70 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని సిసోదియా తెలిపారు.
Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..
అయితే కేంద్రంతో అధికారంలో ఉన్న బిజేపీ ప్రభుత్వం మనీలాండరింగ్ చట్టాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే బిజేపీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలని చెప్పారు. ” నేను కేజ్రీవాల్ జైలు కెళ్లారని మాత్రమే ఈ మాటలు చెప్పడం లేదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీరంతా భవిష్యత్తులో జైలు కెళ్లే అవకాశం ఉంది. హేమంత్ జైలు కెళ్లారు. షరద్ పవార్ పార్టీని చీల్చారు. ఇదంతా జరిగింది కదా? అందుకే ప్రతిపక్ష పార్టీలు కేవలం తమను తాము రక్షించుకోవడం కాదు? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు మనీలాండరింగ్ చట్టం ఎలా దుర్వినియోగం అవుతోందో? ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది.” అని సిసోదియా వ్యాఖ్యానించారు.
Also Read: వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని
ఢిల్లీ ప్రభుత్వంలో 18 మంత్రిత్వ శాఖలను నిర్వహించిన సిసోదియా తిరిగి వాటిని చేపడతారా? అని ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలు నుంచి రాగానే పార్టీ నేతలతో చర్చలు జరిపి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
Also Read: పంద్రాగస్టు రోజు స్వీట్లు పెట్టలేదని.. టీచర్ను చితకబాదిన విద్యార్థులు, ఎక్కడో తెలుసా?