Students beat Teacher in Bihar: స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమకు స్వీట్లు ఇవ్వలేదంటూ టీచర్లపై దాడి చేశారు. ఈ ఘటనపై బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఆ ఉపాధ్యాయులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే ఆ సమయంలో పోలీస్ స్టేషన్ లో కూడా జాతీయ జెండా ఎగురవేత కార్యక్రమం కొనసాగుతున్నందున ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు వేచి చూడాల్సి వచ్చింది. టీచర్లపై విద్యార్థులు దాడి చేసిన ఈ ఘటనపై ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం..
బీహార్ రాష్ట్రంలోని బక్సర్ లోని మురార్ ఉన్నత పాఠశాలలో గురువారం పంద్రాగస్టు 15 వేడుకలను నిర్వహించారు. అయితే, ఈ క్రమంలో ఓ సంఘటన చోటు చేసుకుంది. టీచర్ల పై విద్యార్థులు దాడి చేశారు. జెండా ఎగురవేసిన అనంతరం స్వీట్లు పంచారు. ఈక్రమంలో మెయిన్ గేట్ వెలుపల నిలబడి ఉన్న పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులను తమకు కూడా స్వీట్లు ఇవ్వాలని కోరారు. అయితే, మీరు పాఠశాల విద్యార్థులు కాదంటూ వారికి స్వీట్లు ఇచ్చేందుకు ఉపాధ్యాయులు నిరాకరించారు.
Also Read: జమ్ము కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఈ క్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య మాటామాట పెరిగింది. అది కాస్త తోపులాటకు దారి తీసింది. ఈ తోపులాటలో ఓ ఉపాధ్యాయుడు అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన పంకజ్ కుమార్ అనే మరో ఉపాధ్యాయుడు వెంటనే అక్కడికి వెళ్లి, అప్పటికే ప్రధాన రహదారిపై పలువురు యువకులతో కలిసి గొడవ చేస్తున్న పిల్లల వద్దకు వెళ్లి ప్రశ్నించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఆగ్రహంచిన యువకులను శాంతింపజేశారు. దీంతో ఉపాధ్యాయులు అక్కడి నుంచి తమ ఇళ్లలోకి వెళ్లిపోయారు.
అంతటితో ఆగకుండా, కొంతమంది విద్యార్థులు పంకజ్ కుమార్ పై దాడి చేశారు. అంతేకాకుండా ఆ ఉపాధ్యాయుడితో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
Also Read: 100 వందే భారత్ రైళ్ల తయారీపై కేంద్రం యూటర్న్? రూ.30 వేల కోట్ల ఒప్పందం ఎందుకు రద్దు చేశారంటే?..
ఈ ఘటనపై ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు, తీవ్ర గాయాలైన ఉపాధ్యాయుడితో కలిసి మురార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే, ఆ సమయంలో పోలీస్ స్టేషన్ లో జెండా ఎగురవేత కార్యక్రమం జరుగుతున్నందున, కొంతసమయం వేచి ఉండాలని పోలీసులు ఆ ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఆ ఉపాధ్యాయులు పోలీసులకు ఘటనకు సంబంధించిన సమాచారం ఇచ్చి తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
అయితే, ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వీట్లు తమకు కూడా ఇవ్వాలని అడిగితే టీచర్లే తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ కొంతమంది విద్యార్థులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రతిసారి కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలప్పుడు స్కూల్లో స్వీట్లు అందరికీ పంచేవారని, అందుకే తాము కూడా వచ్చామని వారు చెప్పినట్లు సమాచారం.