Delhi Tour: త్వరలోనే తమ టీం హైదరాబాద్ను సందర్శిస్తుందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ అన్నారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ 23 సీఎం అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డితో ఆయన తెలంగాణలో పెట్టుబడులపై లోతైన చర్చ జరిపారు. హైదరాబాద్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలమైన పరిస్థితులు, ప్రభుత్వం నుంచి అందించే మద్దతుపై సీఎం రేవంత్ ఆయనకు వివరించారు.
430 ఏళ్ల నుంచి హైదరాబాద్ నగరం హద్దుల్లేని అభివృద్ది చెందుతోందని చెప్పారు. కాలక్రమంలో ఇప్పటి వరకూ మూడు నగరాలుగా హైదరాబాద్ అభివృద్ది చెందిందని యాంగ్ లియూ దృష్టికి తీసుకెళ్లారు రేవంత్. ఇప్పుడు నాలుగో నగరాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రపంచం అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త నగరం నిర్మాణం ఉంటుందన్నారు సీఎం. ఫోర్త్ సిటీలో విద్య, వైద్యం, క్రీడా, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, స్కిల్ డెవలప్మెంట్ లాంటి రంగాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు.
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి పాలసీల్లో మార్పుండదని చెప్పిన రేవంత్ రెడ్డి, అదే తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఆయుధమవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇటీవల అమెరికా, దక్షిణకొరియా పర్యటనలో జరిగిన ఒప్పందాలను కూడా ఆయన వివరించారు. 8 నెలల్లోనే 88 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చామని ఫాక్స్ కాన్ ప్రతినిధులకు చెప్పారు సీఎం. ఫోర్త్ సిటీలో ఫాక్స్ కాన్ పరిశ్రమలకు అన్ని అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. దీనిపై యాంగ్ లియూ సానుకూలంగా స్పందించారు. రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రోత్సాహకాలపై ప్రశంసల వర్షం కురిపించారు. సాధ్యమైనంత త్వరగా స్వయంగా తానే హైదరాబాద్ను సందర్శిస్తానని చెప్పారు. తనకంటే ముందు తమ టీం వస్తుందన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, ఇతరులు పాల్గొన్నారు.