Telangana Women Commission: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తెలంగాణ మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ వ్యవహారాన్ని సుమోటుగా తీసుకుని విచారించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేటీఆర్కు నోటీసులు పంపింది.
స్వాతంత్ర్య దినోత్సవం నాడు కేటీఆర్ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. మహిళలు ఈ సదవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటున్నారు. అయితే, కేటీఆర్ మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుగా చిత్రించే పని చేశారు. మహిళలు ఉల్లి ఎల్లిపాయలు వొలుస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ, అందుకోసమే ఆర్టీసీ బస్సులు నడుపుతారని తమకు తెలియలేదని, వీళ్లు అప్పుడే చెబితే బాగుండేదని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. గొడవలు అవుతున్నాయని బస్సుల సంఖ్య పెంచాలని తాము డిమాండ్ చేశామని వివరించారు.
ఒక్కో మహిళ తమ కుటుంబాన్ని మొత్తంగా ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లవచ్చని, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు కూడా చేసుకోవచ్చని కేటీఆర్ కామెంట్ చేశారు. ఈ కామెంట్లపై మంత్రి సీతక్క, కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్.. మీ తండ్రి ఇలాంటి మర్యాద, సంస్కృతినే నేర్పాడా? అంటూ మంత్రులు మండిపడ్డారు.
ఈ ఘటనపై తాజాగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను ఓ సమావేశంలో యథాలాపంగా ఆ వ్యాఖ్యలు చేశారని, మహిళలను కించపరిచే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. ఉద్దేశ్యపూర్తకంగా తానెప్పుడూ మహిళల పై ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు.