Rishab Shetty: ఎవరి జీవితం ఎప్పుడు మారుతుందో ఎవరు చెప్పలేం. చిన్నతనంలో చదువు సంధ్యలు రానివ్వడు.. పెద్దయ్యాక బిజినెస్ మ్యాన్ గా సెటిల్ అవ్వొచ్చు. అసలు ఎలాంటి స్కిల్స్ రావని కాలేజ్ నుంచి గెంటేయబడినవారు.. ఇప్పుడు ఎంతోమంది ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఇండస్ట్రీలో ఇలాంటివారు చాలామందే ఉన్నారు. మీ ముఖం అద్దంలో చూసుకున్నావా..? అని అవమానాలు పొందినవారు. ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్నారు.
అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అంటే.. అసలు జీవితం ఏంటో తెలియని ఒక వ్యక్తి.. అప్పుల బాధ తట్టుకోలేక మారువేషాలు వేసుకొని తిరిగిన ఒక మనిషి.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. నేషనల్ అవార్డును అందుకోవడానికి సిద్దమయ్యాడు. ఆయన నటనతో పాన్ ఇండియా మొత్తం కన్నడ ఇండస్ట్రీవైపు కన్నెత్తి చూసేలా చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు రిషబ్ శెట్టి.
రిషబ్ శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాంతార అనే ఒక్క సినిమాతో ఆయన జీవితం మొత్తం మారిపోయింది. పాన్ ఇండియా లెవెల్లో రిషబ్ పేరు మారుమ్రోగిపోయింది. అసలు కన్నడ సినిమాలు ఎవరు చూస్తారు అని అనుకొనే దగ్గరనుంచి.. కన్నడ వాళ్లు కూడా సినిమాలు బాగా తీస్తారు అనే వరకు తీసుకొచ్చింది రిషబ్.. కాంతార మూవీనే అంటే అతిశయోక్తి కాదు.
తాజాగా 70 వ జాతీయ అవార్డులను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. కాంతారలోని నటనకు గాను.. ఉత్తమ నటుడు అవార్డును అందుకున్న రిషబ్ తన కెరీర్ ను ఎలా మొదలుపెట్టాడో చూద్దాం. రిషబ్.. కర్ణాటకలోని కెరాడి అనే పల్లెటూరు. చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి పెరిగింది. ఇక ఉపేంద్ర సినిమాలు చూసి.. దర్శకత్వంపై కూడా మక్కువ పెంచుకున్నాడు రిషబ్.
బెంగుళూరులో చదువుకుంటున్న సమయంలో అక్క ప్రోత్సాహం వలన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. అక్కడే నటనలో మెళుకువలు నేర్చుకున్నాడు. రిషబ్ కు ఎవరి మీద ఎక్కువ ఆధారపడడం ఇష్టం ఉండేది కాదు. అక్క మీద ఆధారపడకుండా.. వాటర్ సప్లై చేసే కంపెనీ మొదలుపెట్టాడు. ఉదయమంతా పని.. నైట్ ఆ వాటర్ ట్యాంక్ లోనే పడుకునేవాడు. అలా ఒకరోజు నిర్మాత ఎండీ ప్రకాష్ వద్ద తన మనసులోని మాటను బయటపెట్టాడు.
ఇక నిర్మాత.. తానూ నిర్మిస్తున్న సైనేడ్ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా రిషబ్ కు అవకాశమిచ్చాడు. ఇక అక్కడ ఒక దానిమీదనే ఫోకస్ చేయకుండా.. 24 క్రాఫ్ట్స్ లో అన్ని నేర్చుకున్నాడు. అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. సినిమా వర్క్ ను రుచి చూసిన రిషబ్ మళ్లీ వాటర్ ట్యాంక్ పనులకు వెళ్లలేకపోయాడు. మరో సినిమాకు క్లాప్ బాయ్ గా చేరాడు. అక్కడ డైరెక్టర్ ఎంత అవమానించినా తట్టుకున్నాడు. కానీ, ఒకరోజు డైరెక్టర్ అందరి ముందు చెయ్యి చేసుకున్నాడు. ఆ దెబ్బకు మళ్లీ సినిమా వైపు చూడాలనుకోలేదు.
ఎవరి తలరాతలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది అన్నట్లు మళ్లీ రిషబ్ సినిమాల వైపే వచ్చాడు. 2010 లో నామ్ ఓరీలి ఒండినా సినిమాలో చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత రక్షిత్ శెట్టి నటించిన తుగ్లక్ లో కనిపించాడు.
ఒకపక్క నటుడిగా కొనసాగుతూనే రిషబ్ శెట్టి 2016లో రిక్కీ సినిమా ద్వారా దర్శకుడిగా అరంగ్రేటం చేసి 2017లో కిరిక్ పార్టీ సినిమాతో హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.. ఇక బెల్ బాటమ్ అనే సినిమాతో హీరోగా మారాడు. ఇలా వరుస సినిమాలు చేస్తున్న నేపథ్యంలోనే కాంతార కథ పై దృష్టి పెట్టాడు. చాలా చిన్న సినిమాగా ఈ చిత్రాన్ని మొదలుపెట్టాడు రిషబ్. హీరోగా, దర్శకుడిగా చాలా తక్కువ పారితోషికంను అందుకున్నాడు.
ఇక ఎన్నో అంచనాలు మధ్య కాంతార 2022లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. రిషబ్ ను ఓవర్ నైట్ స్టార్ హీరోను చేసింది. రిషబ్ ను పాన్ ఇండియాకు పరిచయం చేసింది. ఇప్పుడు నేషనల్ అవార్డును అందుకునేలా చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీక్వెల్ రాబోతుంది. దీనికోసం అభిమానులు ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.