Matthew Perry| హాలీవుడ్ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మార్పులు జరిగాయి. డ్రగ్స్ ఓవర్ డోస్ తో పెర్రీ మరణించాడని తేలడంతో.. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని గురువారం అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో మొత్తం అయిదుగరు నిందితులుగా గుర్తించినట్లు సమాచారం. ఆ అయిదుగురు నిందితులలో ఒకరు నటుడి అసిస్టెంట్ కాగా ఇద్దరు డాక్టర్లు ఉండడం గమనార్హం. డాక్టర్లే నటుడికి భారీ మోతాదులో డ్రగ్స్ ఇచ్చారంటూ అమెరికా అటార్నీ లాయర్ మార్టిన్ ఎస్ట్రాడా తెలిపారు.
డ్రగ్స్ వ్యసనానికి బానిసైన నటుడు పెర్రీ నుంచి డ్రగ్స్ కోసం డాక్టర్లు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆధారాలున్నాయని లాయర్ మార్టిన్ గురువారం వెల్లడించారు. ”ఈ అయిదుగురు నిందితులు తాము చేస్తున్నది తప్పు తెలిసి కూడా పెర్రీ వ్యసనాన్ని అవకాశంగా ఉపయోగించుకున్నారు. ఇదంతా డబ్బుల కోసమే చేశారు.” అని లాయర్ మార్టిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. హాలీవుడ్ నటుడు మాథ్యూ పెర్రీ 2023 అక్టోబర్ 23న చనిపోయాడు. ఆయన కేటమైన్ అనే మత్తు పదార్థం ఓవర్ డోస్ తీసుకోవడం వల్లే మరణించాడని, చనిపోయిన రోజు చాలా కీటమైన్ ఇంజెక్షన్స్ తీసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. అతని పర్సనల్ అసిస్టెంట్ కెన్నెత్ ఇవామసా స్వయంగా ఆ కీటమైన్ ఇంజెక్షన్లు.. పెర్రీకి ఇచ్చాడని పోలీసులు తెలిపారు.
కీటమైన్ మత్తు ఇంజెక్షన్లు తీసుకున్న మరుసటి రోజే చనిపోయాడు. ఆయన చనిపోయాడని పర్సనల్ అసిస్టెంట్ కెన్నెత్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నటుడు పెర్రీ తన ఇంట్లోని బాత్ రూమ్ లో ఒక బాత్ టబ్ లో అపస్మారక స్థితిలో కనిపించాడని పోలీసులు తెలిపారు. డిసెంబర్ లో పెర్రీ పోస్ట్ మార్టెమ్ రిపోర్టుని లాస్ ఏంజిల్స్ పోలీసులు విడుదల చేశారు. అతని రక్తంలో ఒక పేషంట్ కు సర్జరీ సమయంలో ఇచ్చే కీటమైన్ కంటే చాలా ఎక్కువ మోతాదులో ఉన్నట్లు రిపోర్టులో ఉంది.
పెర్రీ మరణించిన వెంటనే నిందితులంతా కలిసి తమకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలన్నీ మాయం చేయాలని ప్రయత్నించారని పోలీసుల విచారణలో తెలిసింది. కీటమైన్ డ్రగ్ డిప్రెషన్, విపరీత కీళ్ల నొప్పుల సమస్యలకు చికిత్స సమయంలో ఉపయోగిస్తారు. డాక్టర్లు ఈ డ్రగ్ ని తక్కువ అతి తక్కువ మోతాదులోనే సూచిస్తారు.
పెర్రీ మృతికి కారణమైన అయిదుగురు నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు నటుడి పిఏ కాగా మరొకరు ఒక డాక్టర్. మరో డాక్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్ట్ అయిన ఇద్దరు కూడా నేరం అంగీకరించినట్లు లాయర్ మార్టిన్ తెలిపారు. అయితే నటుడి పిఏ ఈ కేసులో అప్రూవర్ మారినట్లు చెప్పారు.
గత దశాబ్ద కాలంలో కీటమైన్ డ్రగ్ వినియోగం బాగా పెరిగిపోయిందని డాక్టర్లు చెబుతున్నారు. అమెరికాలో ఎక్కువ మంది డిప్రెమషన్, ఆందోళన, ఆరోగ్య సమస్యల కారణంగా ఈ డ్రగ్ ని ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారని.. అయితే డాక్టర్లను సంప్రదించకుండా స్వయంగా కీటమైన్ తీసుకోవడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఈ డ్రగ్ కి త్వరగా రక్తంలో కలిసిపోయే గుణం ఉండడంతో పెర్రీ మృతి చెందాడని డాక్టర్లు అభిప్రాయపడ్డారు.
Also Read: ఒక్క రోజులో 10 అంతస్తుల భవన నిర్మాణం పూర్తి.. అంతా చైనా మహిమ!