Kcr : భారత్ రాష్ట్ర సమితి దేశవ్యాప్త విస్తరణపై కేసీఆర్ దృష్టిసారించారు. అందుకే హస్తిన కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నద్ధవుతున్నారు. ఢిల్లీలో కేంద్ర కార్యాలయాన్ని ఈ నెల 14న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సతీసమేతంగా సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
ఢిల్లీలో కార్యాలయ ప్రారంభోత్సవ సమయంలో యాగం నిర్వహిస్తారు. ఈ నెల 13, 14 తేదీల్లో రాజశ్యామల యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఢిల్లీలోని బీఆర్ఎస్ కొత్త ఆఫీస్ లో యాగం జరుగుతుంది. యాగశాల నిర్మాణం, కార్యాలయంలో చేపట్టాల్సిన మరమ్మతులపై ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్తేజతో చర్చించారు. పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా నిర్వహించే హోమంలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారు.
ఢిల్లీలో పటేల్ మార్గ్లో బీఆర్ఎస్ పార్టీ తాత్కాలిక కేంద్ర కార్యాలయం ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ పర్యవేక్షిస్తున్నారు. వారిద్దరూ శనివారమే ఢిల్లీకి చేరుకుని అన్ని పనులు దగ్గరుండి చేయిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ వీధుల్లో బీఆర్ఎస్ హోర్డింగ్లు,ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్ ఫర్ ఇండియా, దేశ్ కి నేత, కిసాన్ కీ భరోసా, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాలతో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ నెల 14న జరిగే పార్టీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు. పలువురు నేతలు సోమవారం సాయంత్రానికే ఢిల్లీకి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. శీతాకాలం నేపథ్యంలో ఢిల్లీకి వెళ్తున్న నేతలకు వసతి కల్పించే బాధ్యత పార్టీ ఎంపీలకు అప్పగించారు. ఈ నెల 14న కార్యాలయం ప్రారంభం తర్వాత ఢిల్లీ వసంత్ విహార్లో నిర్మాణంలో ఉన్న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ శాశ్వత భవన నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలిస్తారు. నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఏ పార్టీ నేతలతో భేటీ అవుతారనే ఆసక్తి నెలకొంది. అలాగే ఢిల్లీ వేదికగా ఎలాంటి అజెండాను ప్రకటస్తారో చూడాలి మరి.