Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. తొలుత అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును ఈడీ చేర్చింది. ఆ తర్వాత సీఆర్ పీసీ 160 కింద సీబీఐ నోటీసులిచ్చింది. ఆదివారం కవిత నివాసానికి వచ్చి సీబీఐ అధికారులు ఏడున్నర గంటలపాటు విచారించారు. అయితే ఇప్పుడు కవితకు సీబీఐ సీఆర్పీసీ 91 నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
సీఆర్ పీసీ 91 అంటే…
కోర్టు లేదా దర్యాప్తు అధికారులు ఏదైనా డాక్యుమెంట్ లేదా వస్తువు విచారణకు అవసరమని భావిస్తే ఆ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉందని అనుమానిస్తారో వారికి సీఆర్పీసీ 91 కింద నోటీసులు ఇస్తారు. సీఆర్పీసీ నోటీసుల్లో రెండు సబ్ క్లాస్లు ఉంటాయి. సీఆర్ పీసీ సబ్ క్లాస్- 1 ప్రకారం నోటీసులు అందుకున్న వారు విచారణ సమయంలో కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్, మెటీరియల్ ఇవ్వాల్సి ఉంటుంది. పత్రాలు, సీడీలు, ఫోన్లు, ఇతర మెటీరియల్ సమర్పించాలి. సీఆర్ పీసీ సబ్ క్లాస్ -1 ప్రకారం నోటీసు ఇస్తే సీబీఐ కార్యాలయానికి స్వయంగా వెళ్లి ఆధారాలు ఇవ్వాలన్నది న్యాయనిపుణులు మాట.
సీఆర్ పీసీ సబ్ క్లాస్ -2 ప్రకారం నోటీసు ఇస్తే.. సీబీఐ ఆఫీస్కు వెళ్లనవసరం లేదు. కానీ ఆధారాలు ఇవ్వాలి. ఎవరితోనైనా డాక్యుమెంట్స్ పంపే వెసులుబాటు కల్పిస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత వద్ద కీలక ఆధారాలు ఉన్నాయని భావించి సీబీఐ .. సీఆర్ పీసీ 91 నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో మరోసారి విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు కవితకు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ సారి కవితకు సబ్ క్లాస్- 1 నోటీసులు ఇచ్చారా? లేదా సబ్ క్లాస్ -2 నోటీసులు జారీ చేశారా అనే దానిపై ఈ కేసు దర్యాప్తు ముందుసాగుతుంది.