Anna Canteens Daily Expenditure in AP(Andhra Pradesh today news): ఏపీలో అన్న క్యాంటీన్లు తిరిగి పున:ప్రారంభమవుతున్నాయి. గురువారం సీఎం చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్ను ప్రారంభించగా.. శుక్రవారం రాష్ట్రంలో మరో 99 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో మండలానికో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ అన్న క్యాంటీన్లను ట్రస్ట్ ద్వారా శాశ్వతంగా కొనసాగించనున్నట్లు ప్రకటించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించినప్పటికీ భవన నిర్మాణ పనులు పూర్తికానందున విడతలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇక, గుంటూరు జిల్లా తాడేపల్లి మండంలోని నులకపేటలో శుక్రవారం ఉదయం మంత్రి నారా లోకేశ్ అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. అనంతరం అల్పాహారం వడ్డించారు. ఒంగోలులో అన్న క్యాంటీన్ ను మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రారంభించారు. కుప్పంలో అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు.
పేదలకు అవసరమైన ప్రదేశాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 99 క్యాంటీన్లు ప్రారంభిచామన్నారు. ఒక్కో వ్యక్తికి రోజూ రూ.90 ఖర్చు చేస్తున్నామని, ఇందులో ప్రభుత్వం రూ.75 భరిస్తుందన్నారు. దాతల నిధులతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి అన్న క్యాంటీన్లను నిరంతరం కొనసాగిస్తామని మంత్రి వెల్లడించారు.
అన్న క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం అందించనున్నారు. ఇక, ఈ క్యాంటీన్ల నిర్వహణకు రోజుకు రూ.53 లక్షల ఖర్చు అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. అల్పాహారానికి రూ.22, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి కలిపి రూ.68 ఖర్చు అవుతుండగా.. ఒక్కరోజు ఒక్కరికి మొత్తం రూ.90 వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కరోజు ఒక్కరు మూడు పూటలకు కలిపి రూ.15 చెల్లిస్తే.. మిగతా డబ్బును రూ.75ను ప్రభుత్వం, దాతలు ఖర్చు చెల్లించనున్నారు. ఈ క్యాంటీన్లలో మూడు పూటలు కలిపి ఒక్కరోజు 1.05 లక్షల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు. ఉదయం 35వేల మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35 వేలు. రాత్రి మరో 35 వేల మందికి భోజనం అందించనున్నారు.
Also Read: జగన్కి మంత్రి నారా లోకేష్ కౌంటర్.. రెడ్ బుక్ డీటేల్స్ బయటకు..
అన్న క్యాంటీన్లలో పేదలు, పనికోసం బయటకి వచ్చిన వారు రూ.15 చెల్లించి మూడు పూటలు కడుపునిండా తినవచ్చని తెలిపింది. తొలి విడతలో ప్రభుత్వం 100 క్యాంటీన్లను ప్రారంభించింది. అన్న క్యాంటీన్ల పున: ప్రారంభం సంతోషకర విషయమని, అయితే వీటిని ఆస్పత్రుల వద్ద ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని చూడటానికి వచ్చేవారు, లేదా కుటుంబ సభ్యులు రోజులో ఒక్కపూట భోజనం చేసేందుకు కనీసం రూ.50 నుంచి రూ.80 వరకు ఖర్చు అవుతుందన్నారు. ఈ అన్న క్యాంటీన్లను ఆస్పత్రి సమీపంలో ఏర్పాటు చేస్తే.. రూ.15కే మూడు పూటలు తినేందుకు అవకాశం ఉంటుందన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ.
For More Updates Download The App Now – https://t.co/qmKskeAd4t pic.twitter.com/VWvSNCqC3q— ChotaNews (@ChotaNewsTelugu) August 16, 2024