Impact of Varalakshmi Vratam Flowers Rates High: తెలుగు రాష్ట్రాల ప్రజలు వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని సంప్రదాయం ప్రకారం.. ఆచరిస్తే సౌభాగ్యంతోపాటు సుఖ, సంతోషాలు కలుగుతాయని మహిళలు భావిస్తుంటారు. వరలక్ష్మీ వ్రతం రోజున కొత్తగా పెళ్లయిన దంపతులు భక్తిశ్రద్దలతో పూజలు చేసుకున్నట్లయితే సుఖశాంతులతో దీర్ఘ సుమంగళీభవగా ఉంటారని వేదపండితులు చెబుతుంటారు.
శ్రావణమాసంలో వరుస శుభకార్యాలు, వరలక్ష్మీ వ్రతం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి. అదే విధంగా వాతావరణ మార్పులతో దిగుబడి తగ్గడంతోపాటు వరలక్ష్మీవ్రతం కారణంగా పూల ధరలు మూడింతలు పెరిగాయి. గత నెలలో మల్లెల ధర కేజీ రూ.550 ఉండగా, ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్ లో కేజీ రూ.1,500 పలుకుతోంది. ఇక, తెల్ల చామంతి రూ.200 నుంచి రూ.350, పసుపు చామంతి రూ. 150 నుంచి రూ.రూ.400, కనకాంబరం రూ.100 నుంచి రూ.300, లిల్లీ రూ.150 నుంచి రూ.500, జాజులు రూ.300 నుంచి రూ.1,200 వరకు పెరిగాయి. బహిరంగా మార్కెట్లో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి.
Also Read: వరలక్ష్మీ వ్రతం రోజు కలశ స్థాపన చేయు విధానం.. పూజా పద్ధతి
ఇదిలా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా శ్రావణమాసం శోభే కనిపిస్తోంది. అదే విధంగా ఇవాళ శ్రావణ శుక్రవారం కావడంతో ఆ కల మరింత కనిపిస్తోంది. ముఖ్యంగా మార్కెట్లు అన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. పూలు, పండ్లకు విపరీతమైన గిరాకీ పెరిగింది. దీంతో రేట్లు సైతం అమాంతం పెరిగాయి. అయితే గత రెండు నెలలుగా అధిక ఆషాడం కావడంతో ధరలు లేక నష్టపోయిన పూల వ్యాపారులు..శ్రావణ మాసం సందర్భంగా ధరలు నిలకడగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధిక ధరలతో పూలు కొనుగోలు చేయలేకపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.