Heavy Rains in Telangana: రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది.
ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇదిలా ఉండగా, హైదరాబాద్లో గురువారం రాత్రి వర్షం దంచికొట్టింది. రహదారులపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సాయంత్రం నుంచి వర్షం కురవడంతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. పలు చోట్లు డ్రెయినేజీలు పొంగిప్రవహించడంతో పాటు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. నేడు, రేపు కూడా హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read: సెలవురోజని బయటకెళ్లిన నగరవాసులు.. ఇంతలోనే భారీ షాక్
భారీ వర్షాల సూచనపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్పందించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయలకు రావొద్దని సూచించారు. భారీ వర్షల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే 040-21111111 / 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.