Bhupendra patel : గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజధాని గాంధీనగర్ లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్.. భూపేంద్ర పటేల్ తో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కొత్త సచివాలయం సమీపంలోని హైలీప్యాడ్ మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
సీఎంతోపాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు కాను దేశాయ్, రాఘవ్ జీ పటేల్, రుషికేశ్ పటేల్, హర్ష్ సంఘవి, శంకర్ చౌదరి, పూర్ణేశ్ మోదీ, మనీశా వకీల్, రమణ్ లాల్ పాట్కర్ తదితరులను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
శుక్రవారం భూపేంద్ర పటేల్ మంత్రివర్గంసహా సీఎం పదవికి రాజీనామా చేశారు. శనివారం ఆయనను బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. 2021 సెప్టెంబర్ 13న తొలిసారి భూపేంద్ర పటేల్ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు రెండోసారి సీఎంగా అవకాశం దక్కించుకున్నారు. తాజా ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ ఘట్లోడియా స్థానం నుంచి లక్షా 92 వేల మెజార్టీతో గెలిచారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాలున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో 156 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని రాష్ట్ర చరిత్ర సరికొత్త రికార్డు సృష్టించింది. కాంగ్రెస్ కు 17 , ఆప్ కు 5 స్థానాలు దక్కాయి.