Space: వరుస విజయాలతో దూకుడు మీదున్న ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట షార్లో జరిగే ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్ను నింగిలోకి పంపనుంది ఇస్రో. శుక్రవారం ఉదయం 9 గంటల 17 నిమిషాలకు ఈ ప్రయోగం జరగనుంది. దీని ద్వారా ఈవోఎస్ 8 ఉపగ్రహాన్ని రోదసీలో ప్రవేశపెడతారు. భూపరిశీలన ఈ మిషన్ టార్గెట్. మైక్రో సాటిలైట్ను అభివృద్ధి చేయడం, భవిష్యత్ ఉపగ్రహాల కోసం కొత్త సాంకేతికతలను సిద్ధం చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. అలాగే, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం రాకెట్ను పంపుతున్నారు. అగ్నిపర్వతాల ముప్పును అంచనా వేసి విలువైన సమాచారం అందించేలా రాకెట్ను రూపొందించారు. అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో భారత్ తనదైన ముద్ర వేస్తోంది. అతి తక్కువ ఖర్చుతో రాకెట్లను నింగిపోకి పంపిస్తోంది ఇస్రో. కాగా, ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగంతో గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్లో తమ సత్తా చాటాలని భావిస్తోంది.
ఈ ప్రయోగం భారతదేశ అంతరిక్షానికి సంబంధించి ఒక మైలురాయిగా చెప్పొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఎస్ఎస్ఎల్వీ రాకెట్ను రూపొందించారు. అలాగే, తక్కువ ఖర్చుతో ఇస్రో ఈ రాకెట్ను ప్రయోగిస్తోంది. కేవలం మూడు దశల్లోనే ఈ ప్రయోగం చేయనున్నారు. ప్రయోగం సక్సెస్ అయిందా లేదా? అనేది కేవలం 72 గంటల్లోనే తేలిపోతుంది. ఇది పీఎస్ఎల్వీ రాకెట్లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నింగిలోకి పంపుతున్న ఉపగ్రహం బరువు 175.5 కిలోలు. 5 వందల కిలోలున్న పేలోడ్లను 5 వందల కిలోమీటర్ల ప్లానార్ ఆర్బిట్కు తీసుకెళ్లగలదు. ఇలా తక్కువ ఖర్చుతో ప్రయోగం చేయడంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రపంచ అంతరిక్ష విపణిలో భారత స్థానాన్ని పెంచడమే లక్ష్యంగా ఇస్రో పనిచేస్తోంది.