Tukkuguda Road Accident: ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ సమీపంలో ఓఆర్ఆర్ పై గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వచ్చిన ఓ కారు మరో రెండు వాహనాలను బలంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురు దుర్మరణం చెందారు. సాయంత్రం తుక్కుగూడ నుంచి శంషాబాద్ వైపునకు వెళ్తున్న కారు అదుపు తప్పి మరో కారు, తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టగా, తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న రెండేళ్ల చిన్నారి, మహిళ, ఆ వాహనం డ్రైవర్ మృతిచెందారు. అదేవిధంగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు యాదగిరిగుట్ట నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.
Also Read: సెలవురోజని బయటకెళ్లిన నగరవాసులు.. ఇంతలోనే భారీ షాక్
ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. కాగా, అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.