Racing : హైదరాబాద్ లో ఎంతో ఆసక్తిని రేపిన ఇండియన్ రేసింగ్ లీగ్ అదరహో అనిపించింది.
హుస్సేన్ సాగర్ తీరాన రెండు రోజులపాటు విజయవంతంగా జరిగింది. ఈ రేస్లో అన్ని రౌండ్లూ ఎంతో ఉత్కంఠగా సాగాయి. ఆఖరిలో కొచ్చి, హైదరాబాద్ జట్ల మధ్య హోరా హోరీ పోరు సాగింది.
మొత్తంగా ఇండియన్ రేసింగ్ లీగ్లో 417.5 పాయింట్లతో కొచ్చి అగ్రస్థానంలో నిలిచింది. 385 పాయింట్లతో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 282 పాయింట్లతో గోవా మూడో స్థానంలో నిలిచింది. 279 పాయింట్లతో చెన్నై నాలుగోస్థానంలో, 147.5 పాయింట్లతో బెంగళూరు ఐదోస్థానంలో, 141 పాయింట్లతో ఢిల్లీ టీమ్ ఆరో స్థానాల్లో నిలిచాయి.
మొదటి రోజు రేసులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. రెండో రోజు షెడ్యూల్ ప్రకారం సమయానికి పూర్తయ్యాయి. సాగర్ చుట్టూ మొత్తం 2.7 కిలోమీటర్ల ట్రాక్ ఏర్పాటు చేశారు. ఏడు ప్రాంతాల్లో ప్రేక్షకుల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఆదివారం పోటీలను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. సినీనటులు రామ్చరణ్, నాగచైతన్య రేసింగ్ను వీక్షించారు.