Sravana Putrada Ekadashi 2024: శ్రావణ పుత్రద ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ప్రత్యేకంగా విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. అంతే కాకుండా ఉపవాసాలు కూడా చేస్తారు. శ్రావణ మాసంలోని ఆగస్టు 16వ తేదీన శ్రావణ పుత్రద ఏకాదశి జరుపుకోనున్నాం. ఈ ఏకాదశికి మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంతో ఉంది. ఈ రోజు విష్ణుమూర్తిని పూజించడం వల్ల స్వామి అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు.
శ్రావణ మాసంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతాన్ని సంతానం లేని వివాహిత స్త్రీలు ఆచరిస్తారు. పారణ సమయంలో ద్వాదశి తిథి రోజు ఉపవాసం పాటిస్తారు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మహా విష్ణువును పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఉపవాసం ఉంటే స్వామి, భక్తులు కోరుకున్న కోరికలు తీరుస్తాడని నమ్ముతారు.
ఉత్తర ఏకాదశి సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. ఇది పుష్యమాసంలో ఒకసారి శ్రావణ మాసంలో మరొకసారి వస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి చాలా ప్రత్యేకమైందిగా చెప్పబడుతుంది. శ్రావణ మాస శుక్లపక్షంలో పుత్రద ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించడం వల్ల సంతానం కలగడంతో పాటు పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి.
శ్రావణ పుత్రద ఏకాదశి అనేది పిల్లలు కోరుకునే జంటలకు ముఖ్యమైందిగా చెబుతుంటారు. ఈ రోజు పిల్లల సంతోషాన్ని కోరుకునే దంపతులు తప్పనిసరిగా ఉపవాసాన్ని పాటించాలి. పంచాంగం ప్రకారం సంతానం కలగాలనే కోరికతో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఏకాదశి నాటి నుంచి ఉపవాసం ప్రారంభించి మరుసటి రోజు ద్వాదశి తిథి నాడు ఉపవాసాన్ని విరమిస్తారు. ఇలా చేయడం వల్ల విష్ణువు అనుగ్రహంతో సంతానం కలగడంతో పాటు కుటుంబ శ్రేయస్సు, సంతోషం కలుగుతాయి.
శ్రావణ పుత్రద ఏకాదశి 2024 తేదీ, శుభ సమయం:
ఈ సంవత్సరం శ్రావణ పుత్రద ఏకాదశి ఆగస్టు 16న జరుపుకుంటాము. ఏకాదశి తిథి ప్రారంభం ఆగస్టు 15న ఉదయం 10: 26,
ఏకాదశి తిథి ముగిసే సమయం: ఆగస్టు 16 ఉదయం 09:39 .
పారన సమయం: ఆగస్టు 17 ఉదయం 05:28 నుంచి 08:01 వరకు
శ్రావణ పుత్రద ఏకాదశి 2024 ప్రాముఖ్యత:
శ్రావణ పుత్రద ఏకాదశి తిథి రోజు ప్రారంభమై మరుసటి రోజు ద్వాదశి తేదీతో ముగుస్తుంది. ప్రతి ఏకాదశి దాని స్వంత ప్రత్యేకత కథను కలిగి ఉంది. కానీ పిల్లలు లేనివారికి శ్రావణ పుత్రాద ఏకాదశి చాలా మంచిది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు. గర్భం దాల్చడానికి కష్టపడుతున్న వివాహిత జంటలు ఈ వ్రతాన్ని ఆచరించి భక్తిశ్రద్ధలతో మహా విష్ణువును ఆరాధిస్తారు.
Also Read: వరలక్ష్మీ వ్రతం రోజు కలశ స్థాపన చేయు విధానం.. పూజా పద్ధతి
పూజా విధానం:
ఉదయం నిద్ర లేచి పవిత్ర స్నానం చేయడం ద్వారా మీ రోజును ప్రారంభించడం మంచిది. వ్రతం చేయాలని అనుకున్న వారు ప్రత్యేకించి పీఠాన్ని ఏర్పాటు చేసుకునే ప్రాంతాన్ని శుభ్రం చేసి పెట్టుకోండి. పీఠంపై విష్ణుమూర్తి విగ్రహాన్ని ఉంచి దాని ముందు దేశీ నెయ్యితో నింపిన మట్టి దీపాన్ని వెలిగించండి. ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం మంచిది.
తులసి పత్రాన్ని కూడా విష్ణువుకు సమర్పించండి. విగ్రహాన్ని పూలతో అలంకరించడం మంచిది. ఆ తర్వాత స్వామికి చందనం దిద్దండి. శ్రావణ పుత్రద ఏకాదశి సంబంధించిన కథను కూడా పఠించాలి మరుసటి రోజు పారణ సమయంలో మీ ఉపవాసాన్ని విరమించండి. దీంతో మీ పూజ ముగుస్తుంది.