West Bengal: పశ్చిమ బెంగాల్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ఆసుపత్రుల్లో సరైన భద్రతను ఏర్పాటు చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వద్ద డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మధ్యాహ్నం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ను ఘోరావ్ చేసి తమకు భద్రత విషయంలో, ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘటనలో తమకు సమాధానం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. గవర్నర్ సీవీ ఆనంద బోస్ వారి వద్దకు వెళ్లి డాక్టర్ల నిరసనకు మద్దతు తెలిపారు. వారితో కొద్దిసేపు మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. న్యాయం జరిగేంత వరకు తాను విశ్రమించబోనంటూ స్పష్టం చేశారు. ‘నేను మీతోనే ఉన్నాను. మనమంతా కలిసి దీనిని పరిష్కరించడానికి కృషి చేద్దాం. నేను మీకు న్యాయం చేస్తా. నా చెవులు, కళ్లు తెరిచే ఉన్నాయి’ అంటూ డాక్టర్లకు ఆయన హామీ ఇచ్చారు.
అదేవిధంగా ఘటనా స్థలిని కూడా ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆసుపత్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం నిజంగా ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి, దేశానికి షేమ్. చట్టపరిరక్షకులే కుట్రదారులుగా మారారు. పోలీసులోని ఒక విభాగం రాజకీయం చేయబడింది. అదేవిధంగా నేరపూరితం చేయబడింది. ఇందుకు తృణమూల్ ప్రభుత్వమే కారణం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. స్వాతంత్ర్య దినోత్సవం వేళ సంచలన నిర్ణయం
మరోవైపు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఘటనపై విచారణకు సంబంధించి సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. అయినా కూడా కొంతమంది కావాలనే రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారని అన్నారు. తమకు వ్యతిరేకంగా దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. కావాలంటే తనని ఎంతైనా తిట్టండి.. కానీ, రాష్ట్రాన్ని తిట్టొద్దంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కేసును త్వరగా పరిష్కరించాలను తాను సీబీఐని కోరుతున్నట్లు మమత పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ తరహాలో బెంగాల్ లో కూడా ఆందోళనలు సృష్టించేందుకు బీజేపీ, సీపీఎం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయంటూ ఆమె మండిపడ్డారు. నిరసనలు చేస్తున్న వైద్యులు తిరిగి విధుల్లో చేరాలంటూ బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
Also Read: ప్రోటోకాల్ ఉల్లంఘన!.. రాహుల్ గాంధీకి అవమానం
ఇదిలా ఉంటే.. వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసును సీబీఐ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పరగణాస్ లోని బాధితురాలి నివాసాన్ని సందర్శించి ఆమె తల్లిదండ్రుల వాంగ్మూలాలను తీసుకున్నది. కాగా, ఈ ఘటనలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలిపై సామూహిక హత్యాచారం జరిగి ఉండొచ్చనే అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. పలువురు వైద్యులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని, పోస్టుమార్టమ్ రిపోర్టు కూడా ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయంటూ వారు పేర్కొంటున్నారు.