Test Series : బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు కెప్టెన్సీ బాధ్యతలు కేఎల్ రాహుల్ కు అప్పగించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో భారత్ ఇప్పటికే వన్డే సిరీస్ ను 2-1 తేడాతో కోల్పోయింది. అటు టీమిండియాను గాయాలు వేధిస్తున్నాయి. రెండో వన్డేలో గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు సిరీస్ కు దూరమయ్యాడు. బంగ్లాదేశ్- భారత్ మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. డిసెంబర్ 14 న తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే తాజాగా జట్టులో కొన్ని మార్పులు చేసింది.
గాయం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ సిరీస్కు దూరం కావడంతో సారథ్య బాధ్యతలను కేఎల్ రాహుల్కు అప్పగించింది. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. మొదటి టెస్టు కోసం రోహిత్ స్థానంలో ఇండియా- ఎ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ జట్టులోకి రానున్నాడు. భుజం గాయం నుంచి మహ్మద్ షమీ, మెకాలి గాయం నుంచి రవీంద్ర జడేజా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. దీంతో వారిద్దరూ ఈ సిరీస్కు దూరమయ్యారు. వారి స్థానంలో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ ను ఎంపిక చేశారు. కెరీర్లో 2010లో సౌతాఫ్రికా పై ఒకే ఒక్క టెస్ట్ ఆడిన ఎడమచేతివాటం ఫాస్ట్బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కూడా ఈ సిరీస్కు కోసం సెలక్టర్ల నుంచి పిలుపొచ్చింది.
భారత జట్టు ఇదే..
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, నవ్దీప్ సైని, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.
వన్డే సిరీస్ ను కోల్పోయిన భారత్ టెస్ట్ మ్యాచ్ ల్లో ఎలా రాణిస్తుందో చూడాలి. ఈ సిరీస్ టీమిండియా ఎంతో కీలకం . ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలబడాలంటే భారత్ ఈ సిరీస్ ను తప్పక గెలవాల్సిందే.