Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ దేవిని పూజించడానికి శ్రావణమాసం పవిత్రమైన మాసం. ఈ మాసంలో వచ్చే రెండవ శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున చేసే వరలక్ష్మీ వ్రతానికి ఎంతో మహత్యం ఉంది. వరలక్ష్మీ వ్రతం ఆచరించిన మహిళలు సత్ఫలితాలు పొందుతారు. సౌభాగ్యాన్ని అందించే వరలక్ష్మీ అమ్మవారు కోరుకున్నది ఇస్తుందని చెబుతుంటారు. వరలక్ష్మీ దేవిని భక్తి భావనతో కొలిచే వ్రతమే వరలక్ష్మీ వ్రతం.
స్వయంగా పరమేశ్వరుడే పార్వతికి ఈ వ్రతం గురించి చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. మహా భక్తురాలైన చారుమతీ దేవి వృత్తాంతాన్ని కూడా పరమేశ్వరుడు పార్వతికి వివరించాడు. చారుమతీ దేవి ఉత్తమ ఇల్లాలు. మహాలక్ష్మీ దేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధితో పూజిస్తుండేది. ఆమె పట్ల వరలక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరించిందని చెబుతారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే కోరిన వరాలను ఇస్తుందని భక్తులు నమ్ముతారు. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని ప్రసాదంగా అందుకుంది.
కలశ స్థాపన చేయు విధానం:
వరలక్ష్మీ వ్రతం ఆచరించాలని అనుకున్న రోజు ముందుగా కలశం కోసం తెచ్చుకున్న పాత్రను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించాలి. వ్రతం ఆచరించాలని అనుకున్న చోట స్థలాన్ని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత అక్కడ పీట వేసి దానిపై నూతన వస్త్రం పరిచి ఆ తర్వాత బియ్యం పోసి వేదికను కూడా సిద్ధం చేసుకోండి. వేదికపై పూలు, చందనం, పరిమళ ద్రవ్యాలు చల్లి శోభాయమానంగా చేసుకోవాలి. ఆ తర్వాత కలశాన్ని దానిపై అమర్చాలి. అనంతరం తాంబూలం సమర్పించి ఆరాధించాలి.
కలశంలో ముందుగా స్వచ్ఛమైన నీరు పోసి మామిడాకులు లేదా తమలపాకులు కానీ అందులో వేయాలి. ఆకులు ఏవైనా సరే కానీ నిటారుగా నిలిచేటట్లు ఉంచుకోవాలి. దాని మీద కొబ్బరికాయ ఉంచి దానికి రవిక గుడ్డను వస్త్రంగా చుట్టాలి కొబ్బరి కాయకు ముఖ స్వరూపం వచ్చేలా కళ్లు, ముక్కు, పెదవులు, కనుబొమ్మలు అమర్చి కూడా తయారుచేసుకోవచ్చు. లేదా అమ్మవారి రూపును దానికి తగిలించి కూడా ఆకారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.ఆ తర్వాత ఆ రూపానికి తోచిన నగలు, వగైరా కూడా అలంకరించుకోవచ్చు.
వ్రతతోరణాన్ని ఐదు పొరలుగా తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ తర్వాత మధ్యలో మామిడాకును కానీ తమలపాకును కానీ పెట్టి ముడి వేయాలి. దీన్ని అమ్మవారి సమక్షంలో పెట్టి పూజించిన తర్వాత చేతి మణికట్టు దగ్గర ధరించాలి. వరలక్ష్మీ వ్రతం రోజు నాడు వ్రత తోరణాన్ని కట్టుకుంటే కలశానికి ఉద్వాసన పలికిన తర్వాత తీసివేయవచ్చు. మీ మీ ఇంటి ఆచారాలను బట్టి కూడా పూజా విధానంలో మార్పులు చేసుకోవచ్చు.
Also Read: సంసప్తక యోగ ప్రభావం.. తండ్రీకొడుకులపై చెడు దృష్టి
అమ్మవారి పూజలో ప్రసాదంగా చెక్కర పొంగలి కానీ, పాయసం కానీ నివేదన చేయవచ్చు. పాయసం దేనితో తయారు చేసినా కూడా దోషం ఉండదు. అంతే కాకుండా పూజలో వినియోగించిన బియ్యాన్ని అన్నం వండి దేవతా మందిరంలో ఇలవేలుపుకు ప్రసాదంగా సమర్పించాలి. ఆ తర్వాత స్వీకరించాలి. కలశంలో ఉంచిన కొబ్బరికాయను మరుసటి రోజున మనం పూజించే దేవుడికి నివేదన చేసి ఆ తర్వాత కొట్టి ప్రసాదంగా చేసుకుని అందరూ తీసుకోవాలి. కలశంలో ఉన్న జలాన్ని కుటుంబ సభ్యులందరికీ పంచి పెట్టాలి.