Independence Day Celebrations: సుదీర్ఘ ప్రసంగంతో ప్రధాని మోదీ ఎలాగైతే రికార్డులకెక్కారో, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అరుదైన ఘనతను సాధించారు. పదేళ్ల తర్వాత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న తొలి ప్రతిపక్ష నేతగా నిలిచారు రాహుల్. అయితే, ఆయనకు ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. రాహుల్కు ఎక్కడో వెనుక సీటు కేటాయించారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్ల లక్ష్యాన్ని నెరవేరకుండా చేసి, సొంతంగా కాంగ్రెస్ 99 సీట్లు సాధించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన తమ నాయకుడిని వెనుక కూర్చోబెట్టడంపై అభ్యంతరం చెబుతున్నాయి.
నిజానికి, ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి కేబినెట్ హోదా ఉంది. అలాంటిది, మంత్రులతో సమానంగా ఆయన్ను కూర్చోబెట్టకుండా, వారి వెనుక సీటు ఇవ్వడంపై ఫైరవుతున్నారు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చే జరుగుతోంది. తెల్లని కుర్తా ధరించి స్వాతంత్ర్య వేడుకలకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ఒలింపిక్స్ వీరులతో కలిసి ఆయన కూర్చున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీకి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కాగా, ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఒలింపిక్ పతక విజేతలకు ముందు వరుసలో సీట్లు కేటాయించామని, ఈ కారణంగా కాంగ్రెస్ ఎంపీలకు వెనుక వరుసలో సీట్లు కేటాయించాల్సి వచ్చిందని రక్షణమంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. కానీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీ మాత్రమే కాదు.. లోక్ సభలో ప్రతిపక్ష నేత. అంటే కేబినెట్ మంత్రి ప్రోటోకాల్ ఆయనకూ ఉంటుంది. దీంతో రాహుల్ గాంధీకి అవమానం జరిగిందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
Also Read: Free RTC Bus Journey: మహిళలపై కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు
ఈ ఘటనపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రియాక్ట్ అవుతూ.. దేశ ప్రజలు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు అప్పగించారని, ఇది మోదీకి మింగుడుపడకపోయినా అంగీకరించాల్సిన వాస్తవం అని షర్మిల పేర్కొన్నారు. రాహుల్ గాంధీని వెనుక వరుసలో కూర్చోబెట్టాలనే చిల్లర రాజకీయాలు సరికాదని విమర్శించారు. దేశ ప్రజలు రాహుల్ వెంట ఉన్నారని, పార్లమెంటులో గొంతులేని వారికి గొంతుకగా ఆయన ఇకపైనా ఉంటారని పేర్కొన్నారు.