Menstrual Leave: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగినుల కోసం ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని గురువారం వెల్లడించింది. కటక్ లో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పార్వతి పరీదా ఇందుకు సంబంధించిన ప్రకటన చేశారు.
ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందంటూ ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులు ప్రతినెలా తమ రుతుక్రమంలో తొలి లేదా రెండోరోజు ఈ సెలవును తీసుకునేలా ఈ పాలసీని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Also Read: సుదీర్ఘ ప్రసంగం.. తన రికార్డును తానే బ్రేక్ చేసిన ప్రధాని మోదీ
అయితే, మహిళలకు నెలసరి సెలవులపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న సందర్భంలో ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది. మహిళలకు మూడు రోజుల నెలసరి సెలవులు ఇవ్వాలని 2022లో ఓ బిల్లును ప్రతిపాదించినా కూడా దానికి ఆమోదముద్ర పడలేదు. ఇటీవలే సుప్రీంకోర్టు సైతం ఈ అంశంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
‘మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇస్తే వారు మరింత ఎక్కువగా ఉద్యోగాల్లో చేరేందుకు ప్రోత్సహించినట్లే అవుతుంది. అయితే, తప్పనిసరిగా ఇవ్వాలంటూ యజమానులను బలవంతపెడితే అది ప్రతికూల పరిస్థితులకు దారితీసే అవకాశాలున్నాయి. మహిళలను ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశాలు కూడా తగ్గొచ్చు. అది మేం కోరుకోవడంలేదు. మహిళల ప్రయోజనాల కోసం కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారే అవకాశాలున్నాయి’ అంటూ కోర్టు పేర్కొన్నది.
Also Read: మహిళలపై అత్యాచారాలకు కఠిన శిక్షలు ఉండాలి.. ప్రధాని మోదీ
ఇదిలా ఉంటే.. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం 1992 నుంచే అక్కడి ప్రభుత్వ ఉద్యోగినులకు 2 రోజుల నెలసరి సెలవును ఇస్తున్నది. కేరళ ప్రభుత్వం కూడా విద్యార్థినులకు 3 రోజుల పీరియడ్ లీవ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ, అస్సాంలోని గుహవాటి యూనివర్సిటీ, తేజ్ పూర్ వర్సిటీ, పంజాబ్ విశ్వవిద్యాలయాలు తమ విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించాయి.