Sitarama Project: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ ను గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన పైలాన్ ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాగా, తొలి పంప్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించగా,.. ములకలపల్లి మండలం కమలాపురంలో మూడో పంప్ హౌస్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.
Also Read: ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి, ఈ రెండు పనుల కోసం కూడా..
అయితే, ఈ పథకం కింద 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు 3.45 లక్షల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టుకు నీరందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఉమ్మడి ఏపీలో జలయజ్ఞం పథకంలో భాగంగా 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ ఏర్పడిన తరువాత పునరాకృతిలో భాగంగా నిర్మాణంలో ఉన్న రెండు ఎత్తిపోతల పథకాల స్థానంలో సీతరామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2016 ఫిబ్రవరి 16న రూ. 7,926 కోట్లతో ఈ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతి లభించింది. 2018లో ఈ అంచనా వ్యయం రూ. 13 వేల కోట్లకు పైగా పెరిగింది. ఇప్పటికే చేపట్టిన పనులకు పెరిగిన ధరలు, ఇంకా టెండర్లు పిలవాల్సిన డిస్ట్రిబ్యూటరీ పనులకు కలిపి సుమారు రూ. 18 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటివరకు రూ. 7 వేల కోట్లకు పైగా ఖర్చు చేయగా సుమారు మరో రూ. 10 వేల కోట్ల వ్యయం చేయాల్సి ఉంది.