CM Revanth Reddy Important Announcement: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. హైదరాబాద్లోని గోల్కొండ కోటలో జరిగిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అర్హులైన అందరికీ రైతు భరోసా అందిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన విదివిధానాలను ప్రభుత్వ అధికారులు తయారుచేస్తున్నారన్నారు. పూర్తి ప్రణాళిక సిద్ధం కాగానే రైతు భరోసాను లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.
సన్నరకం వరిసాగును ప్రొత్సహించేందుకు రూ.500 బోనస్ చెల్లిస్తామని, దీని కోసం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించామన్నారు. పెండింగ్ ధరణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించామని, భూ సమస్యల పరిష్కారానికి సమగ్ర చట్టం తీసుకురావాలని భావిస్తున్నామన్నారు.
వరంగల్ డిక్లరేషన్ అమలులో భాగంగా రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు. కొంతమంది రుణమాఫీ అసాధ్యమని తప్పుడు ఆరోపణలు చేశారని, కానీ రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసి చూపిస్తున్నామన్నారు. త్వరలోనే రైతుభరోసా పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఏడాది నుంచే ఫసల్ బీమాలో చేరాలని నిర్ణయించినట్లు చెప్పారు.
రైతు రుణమాఫీపై కొంతమంది తప్పుడు సమాచారం దుష్పచారం చేస్తున్నారన్నారు. ఎవరికైనా సాంకేతిక కారణలతో మాఫీ కాకుంటే చేయించే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
ఏకకాలంలో రుణమాఫీ చేయడంతో తమ జన్మ ధన్యమైందని సీఎం అన్నారు. అలాగే తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించిందన్నారు. అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజలపై భారం వేయమన్నారు.
Also Read: బావ బావమరిది మధ్య కోల్డ్ వార్..హరీశ్ వెర్సెస్ కేటీఆర్?
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ సేవలు, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే ధరణి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం అన్నారు.