Tollywood Actor: మీ అందరికి ఏమైంది? అప్పటి ఐక్యత ఎందుకు మాయమైపోయింది. ఏమీ పట్టనట్టు ఉంటే ఎలా? మౌనం దేనికీ పరిష్కారం కాదు. గళమెత్తండి. అన్యాయాన్ని ప్రశ్నించండి. ఇలా నిస్సత్తువగా, స్తబ్దుగా ఉంటే రేపు మీరు ఇష్టపడే వ్యక్తే బలైపోవచ్చు… ఇది ప్రముఖ నటుడు నాగశౌర్య ధర్మాగ్రహం. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి, వాటిని ఆపి తీరాలనే ఆరాటంతో ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్టు ఇది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన ఆ రాష్ట్రాన్నే కాదు.. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. సమాజానికి సేవ చేయాలని, రోగులకు వైద్యం అందించాలనే ఆరాటంతో ఆర్జి కర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్గా చేస్తున్న యువతి.. దారుణ హత్యాచారానికి గురైంది. సమాజానికి సేవ చేయాలనుకున్న తన బిడ్డకు ఎంతటి దారుణం జరిగిందో చూడండి అంటూ తల్లి తల్లడిల్లింది. నేను గోల్డ్ మెడలిస్ట్ను కావాలి అని బిడ్డ చివరిగా డైరీలో రాసుకున్న వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తండ్రి విషాదంలో మునిగిపోయాడు. ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది. దోషిని తేల్చి శిక్షించడానికి సీఎం మమతా బెనర్జీ ఇది వరకే డెడ్లైన్ విధించారు.
ఈ ఘటనపై నాగశౌర్య ఇన్స్టాగ్రామ్లో రియాక్ట్ అయ్యారు. ఆర్జీ కర్ హాస్పిటల్లో జరిగింది.. ఒక్క వైద్యుల సమస్యే కాదని, ఇది మన సమాజానికంతటికీ ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు. తన జీవితాన్నే ఇతరులకు సేవ చేయడానికి అంకితం ఇవ్వాలనుకున్న ఒక యువతి, అదీ ఆమె పని చేసుకుంటున్న చోటే సురక్షితంగా లేనప్పుడు.. ఇంకెక్కడ ఆమెకు సేఫ్టీ ఉంటుందని ప్రశ్నించారు.
‘ఈ అఘాయిత్యం ఎవరికైనా, ఎక్కడైనా ఏ సమయంలోనైనా జరగొచ్చు. మనం మౌనం దాల్చవద్దు. ఈ నేరం చేసిన రాక్షసులకు ఎంతటి కఠిన శిక్ష విధించాలంటే.. దేశం నలుమూలలకూ అది పాకాలి’ అని పేర్కొన్నారు. ‘మన సంస్కృతిలో వైద్యులను దేవుళ్లుగా చూస్తాం. వారు కూడా సురక్షితంగా లేరంటే ఈ సమాజం గురించి ఏం చెప్పేది? నిర్భయ కేసు ఈ దేశం యావత్తు కదిలింది. ప్రతి ఒక్కరూ తమ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. కానీ, ఇప్పుడు? ఆ ఐ్యత ఏమైంది? మనం ఎందుకు కలిసి గళమెత్తడం లేదు? అత్యాచారం అనేది చాలా సాధారణమైన విషయం అన్నంతగా సమాజం మొద్దుబారిపోయిందా?’ అని ఆగ్రహించారు.
‘దేవతా మూర్తులను శక్తిగా పూజించే ఈ దేశంలో 2024లోనే 900 అత్యాచార, అత్యాచార యత్నం కేసులు నమోదయ్యాయి. ఇంకా బయటికి రాని, సమాజపు నిందలను భయపడి మాట్లాడని ఘటనలు ఇంకెన్ని?’ అని నాగశౌర్య ప్రశ్నించారు.
‘మన దేశంలో సగటున ప్రతి రోజు నలుగురు బాలికలు అత్యాచారానికి గురవుతున్నారు. ఇప్పుడు మనం మేల్కొనకపోతే మీరు ఇష్టపడే వ్యక్తే నెక్స్ట్ బలవుతారేమో! ఇలాంటి దారుణాలకు తక్షణమే మరణదండన విధించడం అవసరం. వైద్య సిబ్బంది ఆందోళనలు చేస్తుంటే మిగిలినవారు మిన్నకుండిపోవడం బాధాకరం. ఉద్యోగాలుగానూ మనం విడిపోయామా?’ అని పేర్కొన్నారు.
‘ప్రజలారా మేల్కొనండి! మహిళలు సురక్షితంగా ఉండే, సత్వరమే న్యాయం జరిగే, ఇలాంటి దారుణాలను ఉపేక్షించని సమాజం కోసం మనమంతా ఏకం కావాల్సి ఉన్నది, పోరాడాల్సి ఉన్నది. అలాగైతేనే మంచి సమాజాన్ని కాంక్షించవచ్చు’ అని పిలుపు ఇచ్చారు.