PM Narendra Modi’s Longesh August 15 Speech: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పేరిట అరుదైన రికార్డు నమోదైంది. ఎర్రకోటపై 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏకధాటిగా 98 నిమిషాలపాటు ప్రధాని మోదీ ప్రసంగించారు. అంతకుముందు 2016లో 96 నిమిషాలు ప్రసంగించిన ఏకైక ప్రధానిగా తన రికార్డును మళ్లీ తానే అధిగమించారు.
ప్రధాని మోదీ అత్యల్పంగా 2017లో దాదాపు 56 నిమిషాల పాటు ప్రసంగించారు. 2014లో మోదీ తన తొలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని 65 నిమిషాల పాటు ప్రసంగించారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప్రసంగం కాగా, వరుసగా ఆయనకు ఇది 11వ ప్రసంగం కావడం విశేషం.
మోదీకి ముందు 1947లో జవహర్ లాల్ నెహ్రూ 72 నిమిషాలు, 1997లో ఐకే గుజ్రాల్ 71 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. మన్మోహన్ సింగ్.. 2012లో 32 నిమిషాలు, 2013లో 35 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. ఇక, వాజ్పేయి 2002లో 25 నిమిషాలు, 2003లో 30 నిమిషాల కంటే తక్కువగానే ప్రసంగించారు.
ఇక, 1947లో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 72 నిమిషాలు మాట్లాడారు. అదే విధంగా 1954, 1966లో దివంగత ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీలు అత్యల్పంగా 14 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు.
Also Read: ‘బంగ్లాదేశ్ హిందువులు సురక్షితంగా ఉండాలని భారతీయులు కోరుకుంటున్నారు’
ఇదిలా ఉండగా, 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో పాటు ఎర్రకోటపై ఎక్కువ సార్లు జాతీయ జెండానె ఎగురవేసిన మూడో ప్రధానిగా రికార్డు సృష్టించారు. అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ 11 సార్లు జెండా ఎగురవేశారు. కాగా, ఇప్పటికే వరుసగా 11 సార్లు జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్యేతర ప్రధానిగా మోదీ నిలిచారు.